పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అప్పు డమ్మహీపతి నిద్రావిరహితుండై యుండుటం జేసి యదరిపడి తనపదతలంబు
లొత్తుచున్న యనుచరుల నాలోకించి యిట్లనియె.

322


ఉ.

దీవియఁ దెచ్చి చూడుఁడు మదీయశరీరము తేలు కుట్టిన
ట్లే వెత పొందెడుం గడు రయంబున రం డన వాండ్రు వచ్చునా
లో వివరాంతరంబునకు లోఁగినమత్కుణనాథుఁ గాన కా
భూవరుపాన్పుమధ్యమును బొందినమందవిసర్పిణిం దగన్.

323


క.

పొడగాంచి యిదియె కఱిచెం, బుడమిధవునిదేహ మనుచుఁ బొడవడఁగింపన్
మడిసెను మందవిసర్పిణి, కడు దుర్జనుపొందు హాని గా కేలుండున్.

324


వ.

అని యిట్లు దమనకుండు చెప్పిన విని పింగళకుండు నాపరాక్రమం బెఱింగియు
సంజీవకుఁ డెయ్యైసాధనంబుల నన్ను సాధించువాఁ డనుటయు నతం డిట్లనియె.

325


ఉ.

కొమ్ముల గ్రుచ్చి యెత్తియును ఘోరఖురాగ్రనిపాతనంబులన్
జిమ్మియు దంతఘాతములఁ జించియు వాలవిశాలచాలనో
గ్రమ్ముల నెమ్ము లెల్లఁ గడికండలు గాఁ జదియంగ మోఁదియున్
సమ్మద మారఁ జించు మృగసత్తమ యేమఱి యుండితేనియున్.

326


వ.

అనిన విని పింగళకుండొక్కింత చిత్తక్షోభంబుగా దమనకుం జూచి నీ వింతట నరిగి
యావృషభనాయకుని యభిప్రాయం బెఱిఁగి శీఘ్రంబ రమ్మన్న వాఁడును నంతంత
నొదుఁగుచుఁ జకితుండునుంబోలె సంజీవకుం జేరం బోయిన నతం డిది యేమి భయ
కంపితుండ వగుచుఁ జనుదెంచితివి కుశలంబ కదా యనిన సేవకధర్మంబునం దిరుగు
వారికి సంసారసుఖంబు గలదే విను మని యిట్లనియె.

327


ఉ.

ఇంతటివానిఁ జేసె నృపుఁ డింతధనం బొడఁగూడెఁ బక్ష మ
త్యంతము నాపయిం గల దయత్నసుఖానుభవంబు దీర్ఘకా
లాంతరసంచితం బని నిజాత్మఁ దలంచును బాలిశుండు ప్రా
ణాంతము గాఁ దలంచి చలితాత్మత నుండు వివేకి యిమ్మహిన్.

328


వ.

అని చెప్పి మఱియును.

329


సీ.

ధనవంతు గర్వంబు దార్కొన కేలుండు, వ్యసని కాపద యేల పొసఁగకుండు
సతులఁ జూచిన మతి చలియింప కేలుండు, నృపులమన్నన లేల నిజము లగును
గాలంబుచే రూపుకడచన కీలుండు, గౌరవ మర్థి కేకరణిఁ గలుగు
దుర్జనవాగురఁ దొడర కెవ్వఁడు నిల్చుఁ జిరకాలసుఖము నేనరుఁడు పొందుఁ


గీ.

గాని గుణములు విడిచి పుణ్యానుకూల, వర్తనంబుల నిహపరవైభవములఁ
బొందువాఁ డొక్కఁ డొక్కఁడు పుణ్యపురుషుఁ, డతఁడు దేవాంశజనితమహాత్ముఁ డండ్రు.

330