పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అరుణోదయంబున హరిహరస్మరణంబు, చేయుము మేల్కాంచి చిత్త మలరఁ
దల దువ్వి ముడిచి వస్త్రము పొందుగాఁ గట్టి, చెనసి యాచమనంబు చేసి వచ్చి
సుస్నాన మొనరించి సురభూసురార్చనా, యత్తచిత్తుం డెట్ల యట్ల యుండు
తఱి వచ్చి భిక్షుకత్రయము నీముందటఁ, బొడమినఁ గని వారిఁ బూజ చేసి


గీ.

లగుడమున మస్తకంబులు పగుల నడువఁ, దాఁకు వడునట్టి భిక్షుకత్రయము చూడఁ
దత్క్షణంబున ఘననిధిత్రయము నగుచుఁ, గోటిసంఖ్యలమాడల కుప్ప లగును.

44


వ.

ఇవ్విధంబున సంప్రాప్తం బయినధనంబువలన.

45


సీ.

దేవతాగృహములు దృఢముగాఁ గట్టించి, ఘనతటాకంబులు కలుగఁజేసి
వనములు పెట్టించి వడుగులుఁ బెండ్లిండ్లు, భూదేవసమితికిఁ బొందుపఱిచి
కీర్తికి నెలవైనకృతులకుఁ గర్తవై, నెలకొన నంతంత నిధులు నిలిపి
యధిపతిచేఁ గొని యగ్రహారము లిచ్చి, మఱియుఁ బొందైనధర్మములు చేసి


గీ.

యాశ్రితుల బంధుజనముల నరసి మనిచి, పుత్త్రపౌత్త్రాభివృద్ధితోఁ బొగడువడఁగ
లాలితంబుగఁ బెద్దకాలంబు బ్రతుకు, మనుచు సిద్ధుండు కానరా కరుగుటయును.

46


వ.

అప్పు డావైశ్యకుమారుండు తనదాదిం బిలిచి యిట్లనియె నేఁ డరుణోదయానంత
రంబ మనగృహం బలంకరించి శుచిస్నానంబు చేయించి గృహదేవతలం బూజింపు
ముదయవేళకు నెద్దియేనియు శుభప్రాప్తికిఁ గారణంబు గలదు పొమ్మనిన నమ్ముదుసలి
దాదియు నట్ల చేసినయనంతరంబ.

47


సీ.

పాకశాసనపురప్రాసాదశిఖరాగ్రగురుతరసౌవర్ణకుంభ మనఁగఁ
బూర్వదిగంగనాస్ఫురితఫాలస్థలీదీపితసిందూరతిలక మనఁగ
బహుళవీచీస్ఫురత్ప్రార్దిగంభోరాశికూలప్రవాళనికుంజ మనఁగ
నమరాధిపతిసతీహస్తాబ్జవిన్యసమోహనమాణిక్యముకుర మనఁగ


గీ.

నరుణకిరణుండు పొడచూపె నఖిలజనక, రాబ్జములతోడఁ గుముదవనాలి మొగుడ
జారచోరులచిత్తంబు జల్లనంగఁ, జక్రవాకంబు లానందజలధిఁ దేల.

48


వ.

ఇవ్విధంబున సూర్యోదయం బగుటయుఁ గనుంగొని యవ్వైశ్యకుమారుండు తన
దాదిం బిలిచి యిట్లనియె.

49


క.

క్షారాభ్యంగస్నానము, లారంగ నవశ్య మగుట నతిశీఘ్రగతిన్
జేరంగఁ బిలువు నాపితు, నీరును నటకలియుఁ గాచి నీవు లతాంగీ.

50


వ.

అనిన నాయమ విదగ్ధక్షౌరకుం బిలిచి తెల్పిన వాఁడును దంతధావనపదనఖధావనాది
క్షౌరకర్మంబులు తనకు నత్యంతసమీచీనంబుగాఁ జేసినం బ్రియం బంది యవ్వైశ్యుం
డతని కిట్లనియె నీ వింతకుమున్ను నావలన నెన్నఁడునుం ప్రయోజనం బెఱుంగవు