పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

ఉండి సెట్టిబిడ్డఁ డొకనాఁడు తనదాదిఁ, జేరఁ బిలిచి నాకుఁ జెప్పు మతివ
యయ్య చేర్చి నట్టియర్ధ మెక్కడఁ బోయెఁ, దెలిసి లేమి నెట్లు తిరుగువాఁడ.

34


సీ.

తల మాసినపుడును దైల మించుక లేక, ముదమునఁ గోకయు మొలకు లేక
కడుపార నన్నంబు కుడువ నెన్నఁడు లేక, మన సైన నొకపోఁక తినఁగ లేక
కమ్మపువ్వులపూఁత కలలోపలను లేక, పేర్మికతంబునఁ బెండ్లి లేక
ప్రియబంధుజనులకుఁ బెట్ట నేమియు లేక, దీవించునర్థులఁ బ్రోవ లేక


గీ.

యేల యున్నాఁడ నీదేహ మేల నాకు, విడుతు నీప్రొద్దె కాదేని విపినభూమి
చొచ్చి మునివృత్తిఁ దపము భాసురము గాఁగఁ, జేసి పుణ్యలోకంబులు చేరుఁవాఁడ.

35


వ.

అనినం గన్నీ రొలుక నయ్యుపమాత యిట్లనియె.

36


క.

నాకన్నతండ్రి నీ కీ, శోకం బేమిటికి నేను జూడఁగ భాగ్య
శ్రీకలిమి మెఱయుచుండెదు, లోకంబులు వొగడ బంధులోకములోనన్.

37


గీ.

వెలయ నీవు జనించినవేళఁ దొల్లి, దివ్యయోగీంద్రు నడిగినఁ దేటపఱిచె
నిన్నిసంవత్సరంబులు నిట్టిమాస, మిట్టిదినమున శ్రీకాంత యితనిఁ జేరు.

38


వ.

అని యతం డిట్లు చెప్పె నది యాదిగ నేను సంవత్సరమాసదినంబు లెన్నికొనుచుండు
దు నదియును నెల్లింటికిం బరిపూర్ణం బగుచు వచ్చెఁ దప్ప దని యవ్వైశ్యకుమారు
నూఱడం బలికి మజ్జనభోజనాదుల నతనిఁ బరితుష్టుం జేసి మృదుతల్పంబున నునిచిన
నారాత్రి నిద్రించె నక్కుమారుండును దీర్ఘనిశ్శ్వాసవ్యాకులమానసుం డగుచుఁ
దృతీయయామంబున నిద్రాముద్రితలోచనుం డయ్యుఁ జతుర్థయామావసానంబున.

39


ఉ.

బద్ధగజాజినాంబరము బాలశశాంకళావతంసస
న్నద్ధజటాభరంబు కరుణారసపూర్ణవిలోకనంబునున్
శుద్ధపటీరహీరరుచిశోభితవర్ణము నైనమూర్తితో
సిద్ధవరేణ్యుఁ డొక్కరుఁడు చెచ్చెర నాతనిఁ జేరి యిట్లనెన్.

40


శా.

ఓరీ వైశ్యకుమార సాహసమహోద్యోగంబునన్ జావఁగాఁ
గోరం గారణ మేమి యేఁ గలుగ నీకుం జింత యిం తేల న
న్నారాధించితి పూర్వజన్మమున నయ్యత్నంబునన్ సంపదల్
చేరం బ్రాప్తము నేఁట రేపటను నిశ్చింతుండవై యుండుమీ.

41


క.

కల యని చూడకుమీ నా, పలు కంతయు నిక్కువంబు భావించి మదిన్
దలపోసి యేను జెప్పిన, తెలివిం దగ నాచరింపు ధీయుక్తుఁడవై.

42


వ.

అవ్విధం బెట్టి దనిన.

43