పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అనుచుఁ గదలి పోవు నట పోయి క్రమ్మఱ, మగిడి వచ్చి బాలుమొగము చూచు
సుదతి వచ్చుతెరువు చూచు దిక్కులు చూచు, నిక్కి చూచు గోడ లెక్కి చూచు.

26


వ.

ఇవ్విధంబున నాందోళించుడెందంబు కొందలం బంద నందందు సందడిం బొందుచుఁ
బొందుపడి డిందుపఱుచుకొని పుత్త్రసమానంబుగా మునుమున్న పెంచినవకులంబు
నాలోకించి దాని బంధించినసూత్రంబు విడిచి కొనివచ్చి కుమారునిచుట్టునుం
ద్రిప్పి సంజ్ఞగా నెఱింగించి తలవాకిటం బదిలంబుగా నిలిపి పుత్త్రసంరక్షణంబు
నీకుం గర్తవ్యం బని పలికి బ్రాహ్మణుండు చనినం దదనంతరంబ.

27


సీ.

నకులంబు చూడంగ నొకకృష్ణసర్పంబు, వడిగొని మూషికద్వారవీథి
జొచ్చి బాలునిఁ గవియునంతట ముంగి, యుదరి నాగము ముట్టె యొడిసి పట్టి
కంఠంబు గ్రక్కున ఖండించి మే నెల్ల, శతఖండములు చేసి చంపి వైచి
నవరక్తధార లాననమున జొత్తిల్లి శోభిల్ల, మున్నున్నచోన నిలువ


గీ.

దాన మంది యపుడు ధరణీసురుఁడు తన, పట్టిఁ దలఁచుకొనుచుఁ బాఱుతెంచి
శిరము నోరు రక్తపరిషిక్తముగఁ దన, ముంగిటఁ దనుఁ గన్నముంగిఁ జూచి.

28


క.

ఈనోరు రక్త మూరక, కానేరదు శిశువుఁ జంపెఁగా దుర్జాతం
బైనపురు వంచు నుగ్రత, దానిం జావంగ నడిచెఁ దత్క్షణమాత్రన్.

29


వ.

అడిచి యమ్మహీదేవుం డభ్యంతరమందిరంబునకుం జని శతఖండీకృతకృష్ణసర్పంబును
జెలంగి యాడుచున్న తనకుమారు గనుంగొని నాకులమరణంబునకుఁ బరితప్తాంతః
కరణుం డగుచు నుదరతాడనంబు చేసికొనియు శిరంబు పగుల మోఁదుకొనియు ధరణిం
బడి పొరలుచు మొఱలు పెట్టుచు ననేకకాలంబునం బట్టి పట్టివలెఁ బెంచిననకులంబుం
బరామర్శింపక వధించినపాపం బేమిటం బాయునని మఱియు ననేకప్రకారంబుల
బ్రలాపించుసమయంబున భార్య చనుదెంచి యిది యేమినిమి త్తం బని యడిగిన
నతండు తద్వృత్తాంతం బంతయుం జెప్పిన నమ్మగువ యతని కిట్లనియె.

30


క.

పదిలముగ వినక చూడక, మొదలఁ బరామర్శ చేసి మొనయక పరుసం
బొదవించు నెవ్వఁ డాతం డదయత క్షౌరకుఁడువోలె నాపదఁ బొందున్.

31


వ.

అనిన నవ్విధం బెఱింగింపు మని యావిప్రుండు భార్య నడిగిన నమ్మానినీతిలకం
బిట్లనియె.

32


చ.

కలఁ డొకపట్టణంబునను గ్రామణి వైశ్యకుమారుఁ డెల్లవా
రలుఁ గొనియాడునట్టివివరంబుగలం డతిధార్మికుండు పె
ద్దలయినతల్లిదండ్రులును దత్పరివారము రోగబాధలన్
బొలిసిన దాదిచేఁ బెరిఁగి పూర్వవయఃపరిపాకశాలియై.

33