పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దా నది చూచి బ్రాహణుఁడు తద్దయు శోకము నొంది యాత్మలో
మానిని నేల పంపితిఁ గుమారునిరక్షకు లెవ్వ రిత్తఱిన్.

22


వ.

అని మఱియు నమ్మహీసురవరుండు తనమనంబున.

23


ఉ.

ఎన్నఁడు వచ్చుఁ బుణ్యతిథి యెన్నఁడు దానముచేయు భూవరుం
డెన్నఁ డకించనత్వమును నేఁ బెడఁబాసి సమస్తవస్తుసం
పన్ననికేతనుండ నగుభాగ్యము గల్గునొ యంచుఁ గోర్కిమై
నున్నయెడన్ ధనాగమము నొందుటకుం దఱి తప్పె నెట్లోకో.

24


ఉ.

అక్కఱ లెల్లఁ దీఱవు నృపాగ్రణికిం బొడసూపకున్న నా
కిక్కడ వెన్నపాపనికి నెవ్వరు కా పిఁక వేళ దప్పెఁ బో
నక్కడ నేప్రయోజనము లబ్బు మనంబున మానవుండు దా
నొక్కటి చింతసేయ విధి యొక్కఁడు వేఱ తలంచు నక్కటా.

25