పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

పగవానిపక్షమునవాఁ, డగపడినం గాచెనేని నత్యాసన్నుం
డుగ మెలపఁదగదు మెలపినఁ, దెగు నుపమర్దుండపోలె ధీరహితుండై.

308


గీ.

అరులవద్దనుండి యరుదెంచి కొల్చిన, భటుఁడుఁ బాము నొక్కభంగి గాన
మోసపుచ్చి చెఱుచు నాసన్నుఁ డౌవాని, నమ్మినట్లయుండి నమ్మఁదగదు.

309


వ.

అని చెప్పి మఱియును.

310


సీ.

జలక మాడెడువేళ సరసాన్నపానంబు లింపైనయవి భుజియించుతఱిని
కామినీసంభోగకాలంబులెడ మృగ, యావినోదంబుల కరుగుపట్ల
విమతులపై దండు వెడలుచో నట పోయి, విడియుచు నిద్రించువేళలందు
నాస్థానమునఁ గొలువైయున్నయప్పుడుఁ నారామకేళీవిహారములను


గీ.

నృపుఁడు దేహంబుసంరక్ష నియతిఁ జేయఁ, దగును ధర్మార్థకామసాధనము గాఁగ
మనుజనాయకుఁ డించు కేమఱియెనేని, చెడుట సహజంబు నయశాస్త్రసిద్ధమతము.

311


సీ.

దుర్మంత్రి నేలినతోడనే చెడు రాజు, చెడు నపథ్యంబులు చేసి రోగి
కలిమికి గర్వించి కలవాఁడు చెడు వేగ, లోలుఁడు చెడుఁ బరస్త్రీలవలన
బుద్ధి చాలక యుండుపురుషుచేఁ జెడు గీర్తి, నడవడి గొఱగామిఁ జెడును మైత్త్రి
చెడు ననాచారిచేఁ జెందినకుల మెల్ల, నర్థలోభమునఁ బుణ్యంబు చెడును


గీ.

వింతభంగి దుర్వ్యసనికి విద్య చెడును, జెడు సుఖంబు పరాధీనసేవకునకు
నాజ్ఞ పాలింపఁ గొఱగానియధిపుఁ డేలు, మండలం బెల్లఁ జెడు మాటమాత్రలోన.

312


సీ.

శుష్కకాష్ఠంబులసోఁకున నగ్నియు, నతిమూర్ఖువలనఁ గ్రోధానలంబుఁ
జపలునివలన దోషంబును మగువలవలనఁ గామోద్రేకవర్ధనంబు
దక్షునివలన నుదాత్తధనంబును, దయగలవారిచే ధర్మములును
మహితాత్మువలనను మహితధైర్యంబును, మనుజేంద్రువలన భూమండలంబు


గీ.

నంతకంతకు నభివృద్ధి నందునట్లు, విశ్రుతోద్యోగనిజధైర్యవిక్రమముల
నతిసమర్థుఁడ వగుట నీ వరుల గెలిచి, యసమజయలక్ష్మిఁ గొంటి వాయసకులేంద్ర.

313


వ.

అని మఱియును.

314


ఉ.

మూఁపున మోసి యైన రిపుమూర్తిఁ జెడం దఱి వేచి యుండఁగా
నోపుట లెస్స బుద్ధియుతుఁ డోపిక గల్గి చలంబు వట్టి ము
న్నేపునఁ జేరి కృష్ణభుజగేంద్రుఁడు కప్పల మోచి యన్నిటిన్
రూపు చెడన్ వధించె నని రూఢిగ వింటిమి గాదె యేర్పడన్.

315


వ.

అనిన మేఘవర్ణుం డక్కథ వినవలతుం జెప్పు మనినఁ జిరంజీవి యిట్లనియె.

316


గీ.

మందవిషుఁ డనుపేరిట బొందుపడిన, యురగ మిట్టట్టు నాఁకటఁ దిరుగుచుండి
కాంచె మండూకగణసమాక్రాంతికలిత, జీవనం బగు నొక్కసరోవరంబు.

317