పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అవి యుపమర్దనునంగము, లివి యారక్తాక్షముఖ్యహితమంత్రిసుహృ
న్నివహములతనువు లనుచును, వివరించి యులూకసమితి వెడలి కడంకన్.

297


గీ.

అపుడు మేఘవర్ణాదివాయసకులంబు, పొరిఁ జిరంజీవిఁ బొగడుచుఁ బోయి నిజని
వాసమున నంచితోన్నతవైభవమున, మేఘవర్ణుండు కొలువున మెఱయుచుండి.

298


వ.

చిరంజీవి నాలోకించి నీ విన్నిదినంబులు శాత్రవజనంబులు నమ్మునట్లుగా నెవ్విధం
బునం గొలిచి తిరిగితి వనిన నతం డిట్లనియె.

299


గీ.

సకలదిక్కుల రాజుల శౌర్యమహిమ, గెలిచి తనుఁ గొల్చుతమ్ములు గలుగునట్టి
పాండవాగ్రజుఁ డనువు గాకుండునట్టి, వేళ హీనుఁడై కొలువఁడే విరటునగర.

300


సీ.

కాషాయదండంబు గైకొని యమసూతి, కంకుభ ట్టనునామకంబు దాల్చె
నడబాలతనమున నధముఁడై పావని, వలలుండు నాఁగ నవ్వలన నిలిచె
నటవేషమున నింద్రనందనుఁ డొకయేఁడు, పేడితనంబునఁ బెంపుదొఱఁగె
హయశిక్షకుం డయి యాలగాపరియు నై, మాద్రేయు లుండిరి మహిమ దొలఁగి


గీ.

కృష్ణ సౌభాగ్యరేఖ నుత్కృష్ట యయ్యు, నిలిచె సైరంధ్రి యను పేర నీచవృత్తి
బలపరాక్రమవంతు లౌపతుల గలిగి, బ్రతుకరా వారు మగుడంగఁ బక్షినాథ.

301


క.

ఏనును నవ్విధమునఁ గడు, హీనదశం బగరఁ గొలిచి యీడేర్చితి నీ
దైనమహాకార్యమును, న్మానసమున నెపుడు నిలిపి మహితవిచారా.

302


వ.

అనిన మేఘవర్ణుండు చిరంజీవి కిట్లనియె.

303


క.

నీ వసిధారావ్రతమున, నావంతయు శంక లేక యహితులలోనన్
జేవ చెడ కెట్లు మెలఁగితి, నావుడు నాతండు పక్షినాథున కనియెన్.

304


సీ.

అవధరింపుం డులూకాధీశమంత్రుల, లోన రక్తాక్షుఁ డనూనవిభవ
సంపన్నుఁడును నయశాస్త్రవిదుండును, సజ్జనప్రియుఁడును సాధుహితుఁడు
విక్రమోదగ్రుండు నక్రూరచరితుండు, నగుచు సర్వజనంబు పొగడుచుండ
బుద్ధిబలంబునఁ బూజ్యుండు నాకంటె, నతఁ డుపమర్దుతో నర్థి నెపుడు


గీ.

నన్నుఁ జంప బుద్ధు లెన్నియేనియుఁ జెప్ప, వినయమున నులూకవిభుఁడు వినక
మఱియుఁ దనకుఁ గలుగుమంత్రులతో నాదు, మతము నడుగ నొక్కమాట గాఁగ.

305


క.

శరణాగతులం జంపెడు, పురుషులు నెచ్చోటఁ గానమును వినమును సు
స్థిరధర్మనిర్మలుఁడవై, పరమకృపం గావు వీనిఁ బక్షికులేంద్రా.

306


వ.

అనిన వారివచనంబు లవలంబించి రక్తాక్షుపలుకు లనాదరంబు చేసి నన్నుఁ దోడ్కొ
ని పోయి కొలిపించుకొని యతం డింత దెచ్చుకొనియె నని యుపమర్దువృత్తాంతం
బంతయుం జెప్పి చిరంజీవి వెండియు నిట్లనియె.

307