పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అని నిశ్చయింపుచు నతివేగమునఁ జని, యేలికఁ గాంచి కే లెత్తి మ్రొక్కి
మనపగ సాధింప ననువైనకాలంబు, తఱిగాంచి వచ్చితిఁ ద్వరితముగను
వెనుక నత్తెఱఁ గెల్ల విన్నవించెదఁ గాని, వీరు వా రన కెల్లవారిచేతఁ
గాష్ఠతృణంబులు గఱచి తే నియమింపు, మని తాను మండుచున్నట్టికొఱవి


గీ.

మెఱసి నేర్పున ముక్కునఁ గఱచిపట్టి, కడలఁ దృణకాష్ఠములు గొంచుఁ గాకకులము
మేఘవర్ణునివెనుక నమిత్త్రతతిని, గెలుచువేడుక నుడువీథిఁ జెలఁగి పఱవ.

285


క.

ఘూకంబు లున్నగుహకునుఁ వాకిటఁ గాష్ఠములుఁ దృణము వడిఁ గప్పింపన్
వే కవిసి చిరంజీవియుఁ, దాకొనఁ దనముక్కు కొఱవిఁ దగిలించి వడిన్.

286


వ.

తనదుపక్షానిలంబునంజేసి యయ్యనలంబు నిగుడం జేసిన.

287


శా.

ధూమజ్వాలలతోడివహ్ని గుహలోఁ దూరంగ నయ్యండజ
స్తోమంబుల్ భయసంభ్రమంబు లడరం దూరంబు గాఁ బాఱఁ ద
త్సీమారంధ్రము లెందు లేకునికి నార్తిం బొంది యచ్చో నిజ
స్వామిం జేరి యచేతనంబు లగుచుం జావంగ వీక్షింపుచున్.

288


వ.

రక్తాక్షుం డుపమర్దున కిట్లనియె.

289


క.

తెగి చంపరాదు గాకముఁ దగ వని దుర్ణీతు లపుడు దలకొల్పఁగ నీ
దగుమంత్రులు నీవును నీ, పగిదిం బడవలసె నిట్టిపాపము గంటే.

290


క.

హితుఁ డైనమంత్రి పలుకులు. మతి ననుమానించి విననిమావవపతి యీ
గతి దుర్దశలం బొందును, సుతసోదరబంధుమిత్రసుదతులతోడన్.

291


వ.

అనిన విని యుపమర్దుం డిట్లనియె.

292


గీ.

విను మధర్మమైనపని ధర్మ మని తోఁచుఁ, గానితెరువు తెరువుగాఁ దలంచు
శత్రు మిత్త్రుఁగాను మిత్త్రు శత్రునిగాను, గాంచు నరుఁడు చేటుకాలమునను.

293


ఉ.

కావున నాకుఁ బధ్య మగుకార్యముగాఁ గడు నొత్తి యమ్మెయిన్
నీవు హితంబు చెప్ప విననేరక దుర్ణయశీలినై చిరం
జీవిఁ బరిగ్రహించి జముఁ జేర నుపాయము చేసికొంటి నే
దైవిక మైనచేఁతకును దప్పునుపాయము లొండు గల్గునే.

294


మ.

ఒకయక్షౌహిణితోడఁ బాండవబలం బున్న న్నిశామధ్యవే
ళను ద్రోణాత్మజుఁ డొక్కఁడుం గదిసి లీలన్ సంహరింపంగ ను
త్సుకతన్ మాన్పఁగఁ జాలెనే హరియు నచ్చో నుండి సర్వంబు దై
విక మంచున్ దెలియంగలేక విధిపై ద్వేషించినం దప్పునే.

295


గీ.

అని యూరకుండునంతట, ననలశిఖాసమితిచేత నన్నియు సమయం
గనుఁగొనుచు వాయసంబులు, పనివడి గుహఁ జొచ్చి చూచి పరమప్రీతిన్.

296