పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ముని పుణ్యాశ్రమభూములు, వనితం గొని తిరిగి తిరిగి వరియింపుఁ డటం
చును విప్రవరుల నడిగినఁ, గనుఁగొని వా రధికబోధకలితాత్మకులై.

273


గీ.

ఇంత చక్కనితరుణి మహీసురులకు, నమర నేర్చునె రాజుల కైనఁ గాక
చెలువ నే మొల్ల మనఘ విచ్చేయు మనిన, నతఁడు గడులజ్జ నింటికి నరుగుదెంచి.

274


క.

ఇది దాఁ గన్యాత్వంబున, ముదిసినఁ గడుధర్మహాని మున్నిటిరూపం
బొదవంగ మూషికంబై, వదలక చరియించుఁ గాక వసుమతి నెందున్.

275


క.

అని పలుక నపుడు మూషిక, తనువునఁ దనమ్రోల నున్నదానిని ఖేదం
బున యొక్కపురుషమూషిక, మున కంటఁగఁ గట్టి రెంటి మునివరుఁ డంపెన్.

276


వ.

అట్లు గావున.

277


తరల.

ఇనసమీరణదేవతాధిపహేమశైలము లాదిగాఁ
దనకు సన్నిధి చేసెనేనియు దానిమూషికజన్మము
న్వినము మాఱఁగ నేర దయ్యెను నీకు నట్టిద మాకులం
బున జనించు టనంగ నాతఁడు పొంక మింక నడంగినన్,

278


వ.

అంతట నుపమర్దుండును జిరంజీవిఁ జేరంబిలిచి యభయం బిచ్చి వెఱవ కుండు మని
వీడ్కొల్పినఁ గొంతకాలం బుండి దుర్గస్థానమర్మంబు లెఱింగి యాచింజీవి యొక్క
నాఁడు దనలో నిట్లని తలంచె.

279


క.

అరులకుఁ గలసత్త్వంబును, దెరువులు నునికియును వారు ద్రిమ్మరుతావుల్
గిరిదుర్గము సాధించెడు, వెరవును నెఱిఁగితిని నాకు వేళగుఁ జెఱుపన్.

280


గీ.

అని విచారించి గుహచుట్టు నరయఁ దొల్లి, యాలమందలయునికిప ట్టగుటఁజేసి
కుప్పలై యున్నయెరు వెల్లఁ గొక్కిరించి, చరణముల సన్నతెరువుల సరవిఁ బఱచి.

281


వ.

తిరిగి పెద్దవాకిట వచ్చి యులూకంబులఁ జూచునప్పు డవి రాత్రి దూరదేశంబులు
బరిభ్రమించి మేసి వచ్చి యలసి సూర్యోదయసమయంబున మే నెఱుంగక యొం
డొంటిపయిం బడి నిద్రింపఁ జూచి తల యూఁచి చిరంజీవి తనలో నిట్లనియె.

282


ఉ.

నమ్మినవారిఁ జంపినను నాకు నధర్మము గాదు లెస్సగా
నమ్మక చంపరాదు రిపు నన్ను నిజంబుగ నాత్మభృత్యుఁగా
నమ్మినదోష మెవ్విధమునం దగఁ బొందె విచార మేటికిన్
నమ్మిన నానిజేశునకు నాదు హితం బెఱిఁగింతు నంతయున్.

283


ఉ.

ఏపని చేయు మంచుఁ దనయేలిక సేవకుఁ బంచెఁ బొందుగా
నాపని దీర్చి వచ్చుటయ యాతనికిం దగుధర్మ మిట్టిచోఁ
బాపము పుణ్యమున్ విభునిపా లగు భృత్యుని కేమి కారణం
బేపున మేఘవర్ణునకు నీసమయం బెఱిఁగింపఁ బొం దగున్.

284