పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అతిమనోహరాకార యైనయక్కొమ్మం గనుంగొని యొక్కనాఁ డమ్మునీశ్వరుండు
మనంబున నిట్లు విచారించె.

252


క.

ఈకన్నియఁ దగువరునకు, నీకున్న రజస్వల యయి యిది వృషలి యగున్
బ్రాకటనిందాపాత్ర, వ్యాకుల యగు ననుచుఁ దనమహత్వముపేర్మిన్.

253


క.

త్రిభువనదీపకుఁ డగునా, నభోమణిఁ దలంచిన వేగ నమ్మునిమ్రోలన్
శుభమూర్తి వచ్చి నిలిచిన, నభివందన మాచరించి యతఁ డిట్లనియెన్.

254


క.

ఈరూపవతికి మర్త్యులు, గా కని నిలిపితిని భార్యఁ గైకొనుమీ
కోరిక నా కిది యనుటయు, నారవి విని యపుడు వేడ్క నాతని కనియెన్.

255


ఉ.

ఏణవిలోలనేత్ర వరియింప మహాబలుఁ డైనయాజగ
త్ప్రాణుఁడు గాని కాఁ డతనిఁ బ్రార్థన సేయుము నన్ను మీఱు న
క్షీణవిభూతి నాతఁ డని చెప్పి దివాకరుఁ డేఁగినన్ దప
స్త్రాణపరాయణత్వమునఁ దాపసుఁ డయ్యనిలుం దలంచినన్.

256


చ.

తలఁచిన నాసమీరుఁడును దత్పరతం బొడచూపి నిల్చినన్
దళితసరోజనేత్ర యిది నాకుఁ దనూభవ నీకుఁ బత్నిఁగా
నొలసి పరిగ్రహింపు మని యుగ్మలిఁ జూప మునీంద్రుఁ జూచి హా
సలలితవక్త్రుఁ డై మృదువచస్థితితోఁ బవమానుఁ డిట్లనున్.

257


ఉ.

నా కధికుండు దేవపతి నాతుక నాయన కిచ్చినన్ దగుం
గాక మహేంద్రుఁ డైనతనిఁ గా దని యన్యుల కిచ్చు టర్హమే
నాకనివాససౌఖ్యసుమనస్సరసీరుహలోచనాశిర
శ్శ్రీకరపాదపద్మ యయి చెన్నెసలారుచు నుండు టొప్పదే.

258


వ.

అని యిట్లు వాయుదేవుం డమ్మునీంద్రు నొడంబడం బలికి యతనిచేత ననుజ్ఞా
తుండై నిజేచ్ఛం జనియెఁ దదనంతరంబ యమ్మునీంద్రుఁ డింద్రు నారాధించి తలంచిన
నతండును జనుదెంచి పొడచూపి నిలిచి నన్నుఁ దలంచిన కారణం బేమి యని యడి
గిన నయ్యింద్రునకు నమ్మునీంద్రుం డిట్లనియె.

259


చ.

అతులతపస్సమాధినియతాత్ములు నధ్వరకర్తలున్ దృఢ
వ్రతులును దానశూరులును వాసవునిన్ బొడగాననేర ర
ద్భుతము దలంచినంత వృథ పుచ్చక నన్నుఁ గృతార్థుఁ జేయ వ
చ్చితి మునికోటిలోపలఁ బ్రసిద్ధుఁడ నైతిఁ ద్రిలోకనాయకా.

260


వ.

అని మఱియు ననేకప్రకారంబులఁ బ్రస్తుతింపఁ బ్రసన్నముఖుం డైనశతమఖున
కతం డిట్లనియె.

261