పుట:పంచతంత్రము (దూబగుంట నారాయణ).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అనిన దానినాథుఁ డటఁ బాసి తొలఁగిన, నొద్ద నిదురపోవుచున్న విటునిఁ
దెలుప వెఱచి తాను దెలియక నిద్రించు, మగువఁ గాంచి యపుడు మగఁడు కినిసి.

243


క.

ఆమంచము తల నిడుకొని, ప్రేమంబునఁ బెద్దవీథిఁ బెట్టిన జారుం
డామగువఁ బాసి తొలఁగిన, నేమియు నన కతివఁ గొనుచు నింటికిఁ జనియెన్.

244


వ.

కావునఁ బ్రత్యక్షదోషంబు చేసినవానిం జూచి యైన నవివేకి మంచిమాటలకుం జొక్కి
మోసపోవు నని పెక్కుభంగుల రక్తాక్షుండు చెప్పిన నతనిమాట లవధరింపక యాచి
రంజీవిం దోడ్కొని నిజనివాసంబునకుం జని యతని నత్యంతగౌరవంబునం గొలి
పించుకొని యున్నసమయంబున నచిరకాలంబునకు నొక్కనాఁ డుపమర్దుండు సకల
భృత్యామాత్యనివహంబుతోడఁ గొలు వున్నసమయంబునఁ జిరంజీవి చనుదెంచి యత
నికి మ్రొక్కి యిట్లనియె.

245


ఉ.

నీపగవానిముందటను నీగుణముల్ గొనియాడఁ గోపసం
తాపపరీతచిత్తుఁ డయి దండితుఁ జేసెను నన్నుఁ బ్రాణముల్
తీపని యుండ నొల్ల సడి తెచ్చినయీబ్రతు కేల యగ్నిలో
నేపునఁ జొచ్చి దేహము దహించెద నడ్డము రాకుఁ డెవ్వరున్.

246


క.

తనయేలిక ముదల కొనక, గొనకొని ప్రాణంబు విడువఁ గొఱగా దనినన్
నిని రక్తాక్షుఁడు వానిం, గనుఁగొని యిట్లనియె మనసు గనుఁగొనుబుద్ధిన్.

247


గీ.

చచ్చి యేమి సేయు దిచ్చట నీ వన్న, నతఁడు దా నులూక మగుచుఁ బుట్టి
కాకకులము నెల్ల గ్రక్కునఁ జంపుదు, గాలి వోవకుండఁ గాంక్ష దీఱ.

248


వ.

అనిన విని రక్తాక్షుం డవ్విధంబు సేయ నీకు సాధ్యంబుగా దెట్లనినఁ దొల్లి యొక్క
మూషికంబు సూర్యానిలదేవేంద్రమేరుపర్వతంబులు దనకుఁ బ్రత్యక్షంబు లైనను నెప్ప
టిరూపంబునె పొందెఁ గాని యుత్కృష్టజన్మంబు నొంద నేర దయ్యె ననినఁ జిరంజీవి
తత్కథాక్రమం బెట్టి దనిన రక్తాక్షుం డిట్లనియె.

249


సీ.

మునివరుఁ డొకరుండు ముఖ్యతీర్థము లెల్ల, నాడి భాగీరథి కరిగి యందు
నవగాహనము చేసి యాదిత్యుఁ డుదయించు, తఱి నర్ఘ్యజలము హస్తములఁ బట్ట
నయ్యవసరమున నాకాశవీథిగా, నొకడేగ యెలుకఁ బట్టుకొని చనఁగ
నాయెల్క విడివడి యమ్మహీసురు చేతి, యర్ఘ్యజలంబులయందుఁ బడిన


గీ.

నతఁడు గనుఁగొని కౌతుకాయత్తచిత్తుఁ, డగుచు నమ్మూషికముమీఁద నిగుడుకరుణఁ
గన్య యగుఁ గాక యనుటయుఁ గాంత యయ్యె, దానిఁ దనభార్యచేతి కమ్మౌని యొసఁగ.

250


క.

ఆరామయుఁ దనకన్నకు, మారికకం టెను గరంబు మక్కువ మెఱయన్
గారామునఁ బెనుపఁగ న, న్నారీరత్నంబు యౌవనప్రాయమునన్.

251