పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామాయణ మనుపేర నెల్లెడల మిగులం బ్రఖ్యాతి వహించి యున్నది. ఈభాస్కరుఁడు తిక్కనామాత్యునకుం దాత యని నిర్వచనోత్తరరామాయణమునం బ్రథమాశ్వాసములోని —

గీ.

సారకవితాభిరాము గుంటూరువిభుని, మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలఁచి
యైన మన్ననమెయి లోక మాదరించు, వేఱ నాకృతిగుణములు వేయు నేల.

అనుపద్యమునం దనకావ్యము స్వగుణంబునఁ గాకున్నను దనతాత యగు భాస్కరుని దివ్యకవితాప్రాగల్భ్యంబున నైనను లోకాదరణంబు నొందు నని చెప్పికొని యుండుటం దెల్లం బగుచున్నది. మంత్రిభాస్కరుఁడు పూర్వరామాయణము రచింప దానిం బూర్తి సేయం గడంగి కాబోలు తిక్కన యుత్తరకాండమును నిర్వచనముగ నాంధ్రీకరించె. దీనినే యిప్పటికి నూటయిరువది యేండ్లకు మునుపు కంకంటి పాపరాజు తద్దయు విస్తరించి రామనిర్యాణపర్యంతము గొప్పప్రబంధముగ విరచించెను. తిక్కనమాత్రము దన కావ్యము విషాదాంతముగ నుండఁ గూడ దని కాఁబోలు శ్రీరామనిర్యాణమును వచింపఁ డయ్యె. భారతమునఁ గృష్ణనిర్యాణముఁ జెప్పి యున్నను నప్పటికిఁ దనయభిప్రాయము మాఱియుండ వచ్చు నని యూహింపవచ్చును. ఇఁకఁ దిక్కనచరిత్ర యించుక వర్ణింప వలసియున్నది.

తిక్కన

నియోగిబ్రాహ్మణుఁడు, గౌతమగోత్రుఁడు, ఆపస్తంబసూత్రుఁడు, గొమ్మమాంబకు మంత్రిభాస్కరునకుఁ బౌత్త్రుఁడు, కొమ్మనకు నన్నమకుఁ బుత్త్రుఁడు, మహేశ్వరభక్తుఁడు, కేతన, మల్లన, సిద్ధన అనువార లీతని పెదతండ్రులు, ఈవిషయము విరాటపర్వములోని.—

సీ.

మజ్జనకుండు సన్మాన్య గౌతమగోర్ర, మహితుండు భాస్కరమంత్రితనయుఁ
డన్నమాంబాపతి యనఘులు గేతన, మల్లన సిద్ధనామాత్యవరుల
కూరిమితమ్ముండు గుంటూరివిభుఁడు కొ, మ్మనదండనాథుఁడు మధురకీర్తి
విస్తరస్ఫారుఁ డాపస్తంబసూత్రప, విత్రశీలుఁడు సాంగవేదవేది


తే.

యర్థిఁ గల వచ్చి వాత్సల్య మతిశయిల్ల, నస్మదీయప్రణామంబు లాదరించి
తుష్టి దీవించి కరుణార్ద్రదృష్టిఁ జూచి, యెలమి ని ట్లని యానతి యిచ్చె నాకు.”

అను పద్యమువలనను, నిర్వచనోత్తర రామాయణములోని—

మ.

అమలోదాత్తమనీష నే నుభయకావ్యప్రౌఢిఁ బాటించుశి
ల్పమునం బారగుఁడం గళావిదుఁడ నాపస్తంబసూత్రుండ గౌ
తమగోత్రుండ మహేశ్వరాంఘ్రికమలుధ్యానైకశీలుండ న
న్నమకుం గొమ్మనమంత్రికిన్ సుతుఁడఁ దిక్కాంకుండ సన్మాన్యుఁడన్.