22
గాద్గద్యము కలిగెనఁట. కారణము? నిండు సౌందర్య భాండారమ్మగు పరమాత్మదర్శనము కలుగుటయే. ఈ పద్యము చదువుకొనుచుండ, వసుదేవునకు భక్తివలన కలిగిన సాత్వికభావములు రక్తివలన నే పాఠకునకుఁ గలుగకుండును? ఎంత మనోహరమగు భావము !
పూతన వ్రేపల్లెకు వచ్చినది. 'వ్రజకాంతలెల్ల నెవరే యీనాతి ? యనునంతలోఁ జేసేత౯ నిన్నెత్తికొని హసించుచు నిలిచె' నఁట. అంత 'అది నట్టింటను గూరుచుండి నిను మాయాడింభకు౯ ఱొమ్మున౯, గదియంజేయుచు నల్లనయ్య! కడు నాఁకొన్నావు, పాల్ద్రావు మం చది చూపించెడునట్టి వత్సలరస మ్మా హావభావమ్ముల౯, ముదితల్ తత్తఱమొంది. కాదనక యేమో చూచి రాశ్చర్యమై' యఁట. ఏమో చూచిరి అనుప్రయోగము ప్రౌఢము. ఇందలి స్వభావోక్తి సుందరము. ఆ మాటలలోని వత్సలరసము ప్రత్యక్షము.
శకటాసుర భంజనగాథయందు
"ఆఁకటఁ జిక్కి పాలకని యాకులుఁడై తన చిన్నిపాదమే
మో కదలించినాఁ డితఁడు ; నొయ్యన నయ్యది తాఁకి, వ్రయ్యలై
యీకడఁ గూలె బండి, తిలకించితి నే నిది నే నటంచుఁ దా
మేకముఖమ్ముగాఁ బలికి రెల్లరు గోపక బాలకుల్ ప్రభూ!"
అని - శకటమును బసివాఁడు కాలఁదన్ని ముక్కలు చేసినాఁడు చూచితిమని గోపబాలురు చెప్పిరఁట. అంత పెద్ద లా మాటలు విని,
“అననుగతంబు, సుంత నిజమంటకుఁ గాదిది - ముక్కుపచ్చలా
ఱని నిసువుల్ భయంపడి యిటాడెద రంతియకాని వేఱు కా
దని రటఁ గొంద ఱందుఁగల యయ్యలు ; కొందఱు పూతనాగతి౯
గని యగునేమొ కాదనుట గాదని సందియ మంది రచ్యుతా !"
ఇందలి సంశయములు, వికల్పములు, స్వభావసిద్ధములై మనోహరములై దీపించు చున్నవి. 'పూతనాగతి౯ గని' అనుదానిలో 'కని' యను క్త్వార్థకము ఇట హేత్వర్థమున నుపయుక్తమై వ్యాకరణ మార్మికత వెల్లడించుచున్నది. 'వాన కురిసి, త్రోవయంతయు బురదయయ్యెను' అను వాక్యమందు త్రోవ రొంపి యగుటకు హేతువు వానకురియుట. ఆ యర్థము నా వాక్యమునందలి 'కురిసి' అను క్త్వార్ధకము తెలిపినట్లే - పూతనాగతి౯ గని అనఁగా - పూతనయొక్క నడతను, కని-చూచిన కారణమువ' అని యర్థము దెలియఁ దగును. మచ్చున