పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


"కాన గోవిందమాహాత్మ్యకథలయందు
నిరుపమానంద మొంది వర్ణించి సన్ను
తించి నర్తించినట్టి యానియమపరుఁడు
పరమభక్తుండు ఘనుఁడు సద్భాగవతుఁడు.

(నార. 453. పు. 41. ప.)

"సన్నుతించి" శబ్దంలోవున్న 'ఇంచుక్‌'లోని 'ఇ'కారానికి 'నియమ'శబ్దంలోని 'ని' వర్ణగతమైన 'ఇ' కారానికి కేవల స్వరయతిని పాటించాడు. ఒకవేళ యిక్కడ నరసింహకవి కేవలస్వరయతిని ప్రయోగించలేదని అనుకున్నా అగ్రాహ్యవళులుగా కొందరు లాక్షణికులు తిరస్కరించిన "త-న" లమైత్రిని నరసింహకవి ఆమోదించి ప్రయోగించాడని మనం అంగీకరించవలసివస్తుంది. ఈ కేవలస్వరయతిని ప్రాచీనకాలంలో కొందరు ప్రామాణికులైన కవులు సకృత్తుగా ప్రయోగించారు. 1950 - 1951 సంవత్సరాలలో "అప్పకవీయవివరణవిమర్శనాలేశము" అన్న శీర్షికతో "త్రిలిజ్గ" వారపత్రికలో నేను వ్రాసిన వ్యాసపరంపరలోని 24వ వ్యాసంలో ఈకేవలస్వరయతిని గూర్చి చర్చిస్తూ శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యదలో (ప్ర. ఆ. 69. ప) కేవల స్వరయతిని ప్రయోగించాడని యీ క్రిందిపద్యాన్ని ప్రమాణంగా ఉదాహరించాను.

"చాలదళంబుగాఁ బృథులచంపకకీలనఁ బొల్చుబొందుఁడో
మాలె లనంగఁ బండి మహిమండలిఁ జీఱుచు వ్రాలి గ్రంథమూ
ర్ఛాలసయైన భృంగతతినాఁ దుద కప్పమర న్ఫలావళు
ల్వ్రీలిగెల ల్సుగంధికదళీవనపఙ్క్తుల నొప్పు నప్పురిన్.

పైపద్యంలో మూడవపాదంలో 'మూర్ఛాలస' అన్నప్పుడు "అలస" శబ్దంలోని అకారానికి "నాన్" అన్నప్పుడు 'నా'కారంలోవున్న "ఆ"కారానికి కేవలస్వరయతిని వేయడం జరిగింది. వాస్తవానికి 'అనన్‌' అనే అన్నంతక్రియమీద 'నాన్‌' అనే రూపం రూపొందినప్పటికి లాక్షణికంగా "నాన్"లోని స్వరసహితమైన "నా" వర్ణానికే యతి వేయవలసివున్నదికాని 'నా'లోని "ఆ"కారానికి స్వరయతిని వేయడం లాక్షణికం కానేరదు. కాగా యీ సందర్భంలో కృష్ణదేవరాయలు కేవలస్వరయతిని పాటించి ప్రయోగించాడని మనం ఆమోదించక తప్పదు. కరుణశ్రీ శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి సంపాదకత్వాన గుంటూరునుండి వెలువడిన "సుభాషిణి" మాసపత్రికలో 1951లో నేను అనంతుని ఛందస్సుపై వ్రాసిన పరిశోధనాత్మకాలైన విమర్శావ్యాసాలలోసైతం యీ కేవలస్వరయతి ప్రయోగంగురించి సప్రామాణికంగా, సోదాహరణంగా చర్చించివున్నాను. ఇంతకూ యీసందర్భంలో నేను పేర్కొనేదేమంటే కొన్నిపద్యాలలో నరసింహకవి ఉపయోగించిన కేవలస్వరయతి వినూతనమైం దేమీ కాదనీ ప్రాచీనప్రామాణికకవులచేత ప్రయుక్తమైనదేనని మాత్రమే.