పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివకవులు తదితరప్రామాణికకవులు రేఫయుక్తమైన అక్షరాలకూ రేఫవిరహితాలైన అక్షరాలకూ ప్రాసమైత్రిని పాటించారు. నరసింహకవి యీక్రిందిసీసపద్యంలోని తేటగీతి మొదటిపాదంలో "వర్తిలుచుఁ గోటిసూర్యవిస్ఫురితకోటి" (నార. 369. పు. 210. వ.) "వర్తి" అన్నప్పుడు వర్తిలోని "ర్తి" వర్ణానికి "స్ఫురిత" లోని "రి" వర్ణానికి సంయుతాసంయుతప్రాసయతిని విశిష్టంగా పాటించాడు. ప్రాచీనకవులు సంయుతాసంయుతప్రాసలో రేఫసహితరహితత్వాలకే ప్రాధాన్యం యివ్వగా నరసింహకవిమాత్రం రేఫస్థితిని యథాతథంగానే ఉంచి రేఫభిన్నమైన ఇతర హల్ విరహితంగా సంయుతాసంయుతప్రాసను విశేషంగా ప్రయోగించాడు.

ఉపసంహారం

నరసింహకవి విరచించిన యీనారదీయపురాణం అసలు సంస్కృతమూలపురాణానికి గాని, ఉపపురాణానికి గాని సరియైన అనువాదమని సాధికారికంగా చెప్పే అవకాశం లేదని గతంలోనే మనం గుర్తించాము. అయినా నరసింహకవి విశిష్టప్రతిభాసంపన్నవంతమై బహుముఖకవితావైభవంతో విరాజిల్లే యీనారదీయపురాణం ఆంధ్రవాఙ్మయంలో ప్రత్యేకస్థానం వహించుతుందనడంలో యేమాత్రమూ సందేహం లేదు. ఇంక దేవర్షిగా, త్రికాలజ్ఞుడుగా, త్రిలోకసంచారిగా, అపరజగన్నాటకసూత్రధారిగా, ఆచంద్రతారార్కుడై నిలిచిన నారదునివల్ల ప్రోక్తమై అవతరించిన నారదీయపురాణకృతికి ప్రతికృతిగా అలవోకగా ఆవిష్కృతమై వెలసిన నరసింహకవి తెలుగు నారదీయపురాణంలోని రవిశశితేజోమయనేత్రసంకలితుడై, శంఖచక్రగదాశార్జ్గపాణియై, కౌస్తుభమణిశ్రీవక్షస్థలహృదయుడై, మహారాజఫణిశాయిగా, సృష్టిస్థితిసత్యశ్రీమహావిభుడై, అసాధారణ, అపూర్వ, అమేయ జయశ్రీసంశోభితుడై నిరంతరనిర్వికారనిరంజనరూపుడై విరాజిల్లే జగన్నాటకసూత్రధారియైన ఆ శ్రీ మహావిష్ణుదేవుని శక్తిమత్తత్వబోధాత్మకమైన అమృతరసాన్ని ఆస్వాదనం చేసి తరింతురుగాక.

ఇట్లు

అఫ్ జల్ గంజ్,

వాఙ్మయమహాధ్యక్ష

హైదరాబాదు.

డాక్టర్ వడ్లమూడి గోపాలకృష్ణయ్య

1-11-1976

కళాప్రపూర్ణ

డైరెక్టర్

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్

లైబ్రరీ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్.