పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

33



     వైకుంఠపురవర్ణనము

పోవఁగా, నప్పుడు పుణ్యగేహమున
శ్రీవైష్ణవాస్పదశృంగారగరిమ
రతిమీఱు విష్ణుపురాణంబు భాగ
వతమును మొదలైన వైష్ణవకథలు
సొరిదిఁ బఠించు శిష్యులకు బోధించు
నురుపుణ్యభాగవతోత్తమవ్రజము,
ననవరతంబు : "నారాయణ, కృష్ణ,
దనుజమర్దన, జనార్దన, వాసుదేవ,
శ్రీరామ, హరి, శార్ఙ్గి, శేషపర్యంక,
వారిజోదర, రమావక్ష , గోవింద"
యనుచును భువననాయకు విష్ణుదేవు
ఘనకృపాపాత్రులై కడుచెన్నుమీఱి ,
కామరోషాదివికారము ల్మాని,
వ్యామోహకోటులు వదలించివైచి,
మొనసి పంచేంద్రియంబులు మూలకొత్తి
మనమున హంకారమమతలు పాసి,
రాజస తామస ప్రబలంబు లుడిగి,
తేజిల్లు పరమసాత్వికమె చేపట్టి,
యరుదార నిజకృతంబగు క్రియలెల్లఁ
బరమాత్మునకు సమర్పణము గావించి,
సతతంబు శైవవైష్ణవసమర్చనలె
మతములుగా నప్రమత్తమార్గమున
సముచితోన్నతి మీఱ జరపువైష్ణవుల,
రమణ బ్రహ్మర్షి నారద పరాశరులఁ,
బ్రాకటంబుగ మంత్రపాఠక వైష్ణ
వైకాంతికులఁ, బరమైకాంతికులను