పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

528

ద్విపద భారతము.


హరియును భీముండు నమరేంద్రసుతుఁడు
నరదంబునెక్కి ధరాధీశకోటి
కొలువంగ వచ్చిరి గురువేగమునను
దలఁపులోఁబొంగి యింద్రప్రస్థపురికి
ఆపట్టణముజను లప్పుడిట్లనిరి :
"భూపాలవినుతుండు భుజబలాన్వితుఁడు
భీముండు సంగ్రామభీముండు గదిసిి
యామగధేశ్వరునణఁచెఁ గావునను
జతురబ్ధివేష్టిత జగతీతలంబు
చతురంబుగా నేలు శమననందనుఁడు.
సమధికబలు జరాసంధునిఁ జంప
నమర భీముఁడె కాక యన్యులోపుదురె!”
అని రాజనివహంబు నప్పురిజనులుఁ
జనుదెంచి చూచిరి జలజలోచనుని
భీము నర్జునుని గంభీరంబుతోడ.
ఆమెయిఁ గృష్ణభీమార్జును లంత
ధర్మరాజునకును దగుభక్తి మ్రొక్కి,
పేర్మి జరాసంధుఁ బెనఁచి యుగ్రాజి
నణఁచినక్రమమెల్ల నంతయుఁ జెప్పి,
గణుతింప నతనిచేఁ గారాగృహముల
నున్న రాజులనెల్ల నొగిఁ దెచ్చిచూప,
సన్నాహమున వారు శమనసూనునకు
దండప్రమాణంబు దగఁ జేయుటయును,
దండితో వారినందఱ నాదరించి
నిజదేశములకంపె నెయ్యంబుతోడ.
భుజగేంద్రశయనుఁ డప్పుడు పాండుసుతుల
వీడ్కొని రథమెక్కి వెసఁ బురంబునకు
వేడ్కతో నరిగె వివేకంబునందు.