పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

526

ద్విపద భారతము.


నాగిరివ్రజపట్టణాధీశుఁ బట్టి
లాగించి వ్రేసి తా లఘుగతి వానిఁ
గాలను నేలను గాయంబునొంచి
చీలిచివైచి హెచ్చినసాహసమున
మారుతి వానిఁ బల్ముఱు చీల్చివిసిగి
యేరీతిఁ దెగటార్తు నీనీచు ! ననుచు
జింతింపుచుండ, నాశ్రితవత్సలుండు
కంతునితండ్రి శ్రీకలితగాత్రుండు
వనజోదరుండప్డు వడముడిఁజూచి
ఘనవృక్షశాఖ చొక్కంబుగాఁ జీల్చి
తాఱుమాఱుగవైవఁ, దనమదిఁదెలిసి
ధీరుఁడై యమ్మగధేశునిఁ జూచి
పిడికిట భుజసంధి బెడిదంబుగాఁగఁ
బొడిచియు నడిచియుఁ బొరలించి నొంచి,
యొకకాలు నొక కాల నొక కాలు కేలఁ
బ్రకటంబుగామెట్టి పట్టి యమ్మేను
పటపటమనఁజీల్చి పవమానుపట్టి
తటుకునఁ బడవై చెఁ దాఱుమాఱుగను.
ఆవేళ శ్రీకృష్ణుఁ డతిమోదమందె ;
నావేళ దేవతలార్చిరి మింట ;
భీమునియుద్దండభీమశక్తికిని
భూమికంపించె; నంబుధులెల్లఁ గలఁగె;
హిమగిరియొఱగెనో హేమాచలంబు
కమనీయశక్తి భగ్నంబయ్యెనొక్కొ!
యిదియేమియుత్పాత మిప్పుడటంచు
వదలక పురివారు వడఁకిరి కడఁగి.
మగధేశుమానినీమణులగర్భములు
తెగివిచ్చె; వానియుద్దీప్తసైన్యములు