పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

520

ద్విపద భారతము.


భూదేవమణులని పూజసేయంగ
నాదటఁ గదిసి, వా రవి యొల్లకునికి
జూచి యామగధరాజును వారికనియె:
“మీచందములుచూడ మేదినిఁగ్రొత్త!
ధరిణిదేవతలైనఁ దర్కింప మీరు
సురభిపుష్పంబులు శోభితంబైన
గంధంబులును ధూర్తుగతిఁ గొనుటేమి?
బంధురభేరు లుద్భటవృత్తి వ్రచ్చి
సొలయక నాపురిఁ జొచ్చుట యెట్లు!
అలఘుసద్భక్తితో నట నిచ్చునట్టి
మధుపర్క మొల్లక మఱియుండు టెట్లు!
పృథివీశ్వరులు గాని పెంపున మీరు
ధరణీసురులుగారు తర్కించి చూడ
గురుబాహుసత్వు లక్షుద్రవిక్రములు."
అనుటయు వానికి నచ్యుతుండనియె:
"జననాథులము మేము సత్తుగా వినుము;
నీపురిఁజొచ్చుట నీతి మాకెందు;
నేపారుగంధంబు నెల్ల పుష్పములుఁ
గైకొనుటది జయకారణంబనుచుం
జేకొంటి మిప్పుడు సిద్ధంబుగాను.
కార్యంబు నీయందుఁ గలుగుటఁ జేసి
యార్యమతంబున నర్ఘ్యంబు గొనము."
అనిన జరాసంధుఁ డప్పుడిట్లనియె:
"మును మీకు మాకునిమ్ములఁ బగలేదు;
సురలకు ధారుణీసురులకు మునుల
కరుదారభక్తుండ నాదిభూవిభుఁడ."
ననుటయు నచ్యుతుం డతనికిట్లనియెఁ :
“ జెనసి రాజుల నెల్లఁ జెఱఁబెట్టి తీవు;