లైన శతఘంటకవనధురీణులు గలరు గదా! 1550-'80 వరకు మల్కిభరాం పరిపాలనాకాలము. ఈమధ్యకాలమున విజయనగరరాజుల యాస్థానములో జగన్నాథాచార్యులు కనకాభిషేకము పొందియుండవచ్చునని యూహించుట కవకాశము గలదు. ఈజగన్నాథసూరి యనుజుడే మన సింగరాచార్యులు. ఈయనను గూర్చి ముందు తెలుపుదును. సింగరాచార్యుల తరువాత గల కవులను గూర్చి తెలుసుకొందము.
4. వేంకటనరసింహాచార్యులు:- ఈకవి సింగరాచార్యులకు ఆరవతరములో ఈ కోవలోనే సుమారు 1770 ప్రాంతమున నున్నవాడు. ఈపేరుగలవా రీవంగడమున నింక కొందరు గలరు కావున ప్రథమవెంకటనరసింహాచార్యులుగా నీతనిని పరిగణింపవచ్చును. మహాకవియైన యితడు రంగాంబావెంకటార్యుల పుత్రుడు. "షోడశమహాగ్రంథబంధురాలంకారనిర్మాణపారీణఘనయశోబంధురుడు" (గోదా-) ఇతనివి కొన్నిరచనలు మాత్రము లభ్యమైనవి. కనగల్లు నందలి తాళపత్రగ్రంథనిలయములో నేతత్కవివంశీయులైన శ్రీరంగాచార్యులవారు వీనిని బదిలపరచి యుంచెడివారు. గోదావధూటీపరిణయము దక్క తక్కిన వన్నియు నముద్రితములు.
రచనలు :-
- 1. విదేహరాజకన్యకాభ్యుదయము.
- 2. శ్రీకృష్ణశతానందీయము.
- 3. చిలువపడిగఱేనిపేరణము.
- 4. నృకంఠీరవాభ్యుదయము.
- 5. క్షత్రబంధోపాఖ్యానము.
- 6. జాంబవతీకుమారశృంగారవిలాసము.
- 7. రామానుజాభ్యుదయము.
- 8. శల్వపిళ్లరాయచరిత్ర.
- 9. విష్వక్సేనప్రభాకరము.
- 10. గోదావధూటీపరిణయము.
- 11. పద్మినీకన్యకాభ్యుదయము.
- 12. రతిమన్మథాభ్యుదయము.
- 13. మిత్రవిందోపాఖ్యానము.