పుట:దశకుమారచరిత్రము.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

123

వ. అనిన విని విషాచం బంది సుందరులదెస యాసక్తి యింత
     కీ డగునే యని తలంచుచు సవినయంబుగా నమ్మునిపతికిం
     బ్రణమిల్లి.38
తే. వీడుకొని వచ్చివచ్చి యవ్వీటియొద్ద
     భాసురంబైన యొక జైనపల్లెపొంతఁ
     ద్రోవచేరువఁ గొండొక మ్రానిక్రేవఁ
     జూడఁ బొలుపారి తనుపగు నీడ నిలిచి.39
సీ. భూరేణుపటలంటు పొదివిన వక్షంబుఁ
                    గన్నీటఁ దోడ్తోడఁ గడుగువాని
     డాకేలు సెక్కున డాపిడి తనలోనఁ
                    దలపోసి తలపోసి యలయువాని
     ధరలోనఁ గలుగు నొప్పరమిండలకు నెల్ల
                    మొరలు నాఁ జాలిన మూర్తివాని
     బరివోవ నూఁచినఁ బలుచనై తలమీఁదఁ
                    దూఁగాడు వెండ్రుకతోఁకవానిఁ
తే. గూటికుంచెయు వెడచింపిచేట కెలన
     దొంతిబుఱ్ఱల చిక్కంబు పొంతఁ బెట్టి
     వగలఁ బొగిలెడువాని నిర్వాణి నొక్క
     తరుణతాపసిఁ గాంచితి ధరణినాథ!40
క. కని కృపయు వితర్కము నా
     మనమున ముప్పిరిగొనం గ్రమంబున నే నా
     తనికొలఁది దెలియుతలఁపున
     జనపాలకతిలక! డాయఁ జని యి ట్లంటిన్.41