చతుర్థాశ్వాసము
113
క. వినయము సంభ్రమముం దమ
మనముల నెలకొనఁగ నక్కుమారులు నృపనం
దనునకు మ్రొక్కిన నతఁడుం
గనుఁగొని వారల వయస్యగణ మని యెఱిఁగెన్.121
తే. ఎఱిఁగి యపహారవర్మకు నెలమిఁ జూపె
నెట్టి భాగ్యంబు నెచ్చెలు లెల్ల (నిచటి)
కరుగుదెంచిరి చూచితె యనుచు సమధి
కాదరంబున గజపతి నవతరించి.122
వ. వారిం గౌఁగిలించుకొని వార లెఱింగింపఁ బ్రహారశర్మ కామ
పాలుర నర్హప్రతిపత్తి [1]ప్రీతులం గావించి వారికి నపహార
వర్మ నెఱింగించి వారలు నక్కుమారులు నతండును నుచి
తాచారంబులు నడపిన యనంతరంబ యితరధరణీశ్వరుల
నాలోకనసంభాషణంబుల సన్మానించి సింహవర్మను రావించి
లజ్జావనతవదనుండగు నతనిఁ బ్రియాలాపంబులం చేర్చి
పుచ్చి చెలులతోడిసల్లాపంబులు సేయువేడ్క చిత్తంబు వేగిర
పఱుపఁ దదీయసైన్యంబులు సముచితప్రదేశంబుల విడియు
నట్టుగా నియమించి తక్కినరాజుల నెల్ల నిజపురంబులకుం
బోవం బనిచి.123
తే. చెలులుఁ దానును గౌతుక మెలమి మిగుల
నొక్క రమ్యోపవనములో నుల్లసిల్లు
చూతపోతంబుకడ సికతాతలమున
మానవాధీశ్వరుఁడు సుఖాసీనుఁ డయ్యె.124
వ. ఇట్లు సుఖోపవిష్టుం డై.125
- ↑ ప్రేమలం గారవించి