పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

భూచరుఁడైన నేమి? శివపూజలు చేసి యనేకముద్రలన్
చూచినఁ బుణ్యమేమి? యది చూడకయుండిన నేమి తక్కువల్?
ఖేచరిముద్రఁ గాంచి మదిఁ గిన్నరభావము మానసంబులో
గోచరమైన ముక్తి; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

57

భావం:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనృసింహదేవా! అవధరించు! మనుష్యుడు భూమిమీద తిరుగాడుతూ భూచరుడయి యుండి, శివపూజలు చేస్తూ తాంత్రికమైన అనేకముద్రావిశేషాలను అనుభవపూర్వకంగా తెలిసికొనియున్నా, అథవా తెలిసికోలేకపోయినప్పటికినీ అందులో ఎక్కువగానీ, తక్కువగానీ యేమీ లేవు! అటుగాక, (రాజయోగానికి సంబంధించిన) ఖేచరీముద్రను ఆచరణాత్మకంగా దర్శించి, మానవాతీతమైన అనుభవాన్ని మనస్సులో సాక్షాత్కరింపజేసికొనగలిగితే అదే నిజంగా ముక్తి అనబడుతుంది. (అదే ముక్తిమార్గానికి దారి తీస్తుందని అభిప్రాయం).