పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

పామరబుద్ధులన్నియును పగ్గములన్ బిగఁగట్టి, సద్గురు
స్వామినిఁ జేరి, బ్రహ్మమును చాలఁగఁ గాంచినవాఁడు ధీరుఁడై
వేమఱు ముక్తికాంతను వివేకముగాఁ గవగూడు; నన్యథా
కోమలి నంటఁబోఁడు; తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

58

భావము:

దయాసముద్రుడవయిన శ్రీ తరిగొండ లక్ష్మీనరసింహదేవా! చిత్తగించు! పాపకార్యాలను ప్రేరేపించే ఆలోచనల నన్నింటినీ మనస్సనే బలమైన త్రాటితో బిగియగట్టివైచి, ఉత్తమోత్తముడైన గురువర్యుని సన్నిధిని చేరుకొని, పరబ్రహ్మ కళను దర్శించిన పుణ్యాత్ముడు స్థిరచిత్తంతో గూడిన వివేకం గలవాడై, ముమ్మాటికిని ముక్తికాంతను పొందగలడు. అటువంటి మోక్షకామి, మరల కామియై మానవకాంతను తాకడు.