పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

నిష్ఠ లవెన్ని గల్గినను, నేర్పు నరణ్యమునందుఁ బొందినన్,
కష్టము లెన్ని చేసినను గ్రమ్మఱ జీవుఁడు పుట్టకుండునే?
అష్టమదంబుల న్నుడిగి, యాత్మను గాంచినవాఁడు వేగ ను
త్కృష్ట భవాబ్ధి దాఁటుఁ; దరిగొండ నృసింహ! దయాపయోనిధీ!

52

భావం:

దయాసముద్రుడవయిన శ్రీతరిగొండ లక్ష్మీనృసింహదేవా! మనుజుడు అరణ్యంలో నివసిస్తూ, నియమనిష్ఠలు మొదలైన వాటిలో ఎంతో గొప్ప నైపుణ్యాన్ని సాధించినా, అంతమాత్రంచేత ఈ జీవుడు మళ్లీ పుట్టకుండా ఉండజాలడు. (పునర్జన్మను పొందకుండా తప్పించు కోలేడని అభిప్రాయం).

కులమదం, రూపమదం, బలమదం, ధనమదం, యౌవనమదం, విద్యామదం, అధికారమదం, తపోమదం - అనే ఎనిమిదిరీతుల మదములను పూర్తిగా తొలగించుకొని, ఆత్మయొక్క తత్త్వాన్ని దర్శింపగల్గినటువంటివాడు మాత్రమే సువిశాలమైన ఈ సంసారసాగరాన్ని దాటి, (ఆవలితీరమైన) మోక్షాన్ని చేరుకోగలడని సారాంశం.