పుట:తరికొండ నృసింహశతకము (తరికొండ వేంగమాంబ).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు రచించిన పీఠిక

పీఠిక

ఈ నృసింహశతకము రచించిన కవి తరికొండ వెంగమాంబ. ఈ తరికొండ కడపమండలములో నొక గ్రామము. అచ్చట నధిష్ఠితుఁడగు నృసింహస్వామి మహావరప్రదాతయని ప్రఖ్యాతి వడసి భక్తలోకముచే నిరంతర మారాధ్యమానుఁడగుచుండు. వెంగమాంబ చిరకాల మచ్చట వసియించి పిదపఁ దిరుమలలో నివాసము కుదుర్చుకొని శ్రీ వేంకటాచలపతి కైంకర్యమున జీవితకాలము పుచ్చుచుండెను. ఆంధ్రభాషలోఁ గులస్త్రీ కవయిత్రులలో నీమెయు గణనార్హ. కుమ్మరమొల్ల, మదినె సుభద్రమ్మ మొదలగువారు కులస్త్రీలు, మధురవాణి, రంగాజి, ముద్దుపళని ప్రభృతులు గొప్ప కవులయినను వారి యుదంతము నిశ్చయముగాఁ దెలియదు. వెంగమాంబ రాజయోగసారము, భాగవతము ద్విపదకావ్యములుగాను, వేంకటాచలమాహాత్మ్యము పద్యరూపముగను విరచించె. ఈ శతకము లఘు కావ్యమైనను స్వగ్రామదేవతాస్తుతి యగుటచే వేంగమాంబ కున్న యిష్టదేవతాభక్తిని వెల్లడించుచున్నది ఒక్క తాళపత్రప్రతిఁ జూచి దీనిని ముద్రించినారము. భగవద్భక్తుల కిది యింపు గొలుపు ననుట నిక్కము. ఈమె సుమారు 150 సంవత్సరములకుఁ బూర్వముండె ననవచ్చు. ఈ కవి బ్రాహ్మణస్త్రీ, నియోగికుల సంజాత. కృష్ణమంత్రి తనూజ. ఇంజేటి వెంకటాచలపతి భార్య. బాలవిధవయని పండితు లూహించుట కాధార మేమియుఁ గానరాదు. దీనిలో రాజయోగసారాదిగ్రంథములలో వివరింపఁబడిన షట్చక్రాదిశరీరయోగముద్రారహస్యములు చూపఁబడినవి. ఇందుఁ గొన్నిచోటుల వ్యాకరణఛ్ఛందోదోషములును, నశ్లీలపదప్రయోగమును గానవచ్చుచున్నవి. వస్తుస్వరూపము ననుసరించి తదధికారులకు దోషగణనము ప్రధానము కానేరదు.

మా. రామకృష్ణకవి, ఎం.ఏ.