Jump to content

పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

ఇంద్రగోపంబు లవనిపై నెల్లయెడలఁ
గానిపించె సురేంద్రుఁ డగ్గలికతోడఁ
దపముగావించు మౌనిఁ గ్రోధమునఁ జూడఁ
గన్నుగమిరాలు విస్ఫులింగము లనంగ.

15


చ.

కరములు చాఁపి వడ్డిడుటకై బుధశుక్రులసాక్షి పెట్టి య
య్యరుణుఁడు భూమిచేతఁ దగ నప్పులు గైకొని యియ్యకున్నచో
ధర తనమూలవృద్ధులకుఁ దక్కక సాగినవారిఁగూర్చి య
క్కఱగుడి వ్రాసి యాఁగె ననఁగాఁ బరివేషము చుట్టె నాతనిన్.

16


తే.

ఉత్తరపుదిక్కు మెఱుపుల నుల్లసిల్లెఁ
బూర్వదిగ్వాయుసంచయంబులు చెలంగెఁ
దగ నహోరాత్రములును సంధ్యలును దెలియ
రాకయుండెను మేఘసంరంభమునను.

17


సీ.

నిష్కంటకాత్మయై నెగడు వసుంధర
             యత్యంతపంకాత్మయై చెలంగె
నమృతప్రవాహాఢ్య లయిన మహానదు
             ల్గలుషవిషాఢ్యలై కలఁగఁబాఱె
రాజహంస మనోహరం బగుగగనంబు
             సంతతఘనతమశ్ఛన్న మయ్యె
మాధవలక్ష్మీసమన్వితం బగునబ్ధి
             పరజీవనాపేక్షఁ బరఁగి డొంకెఁ


తే.

జాతకంబుల మనములు చల్లనయ్యె
మలయుదావానలంబులు మ్రగ్గిపోయె
సస్యజాతంబు నానాఁట సఫలమయ్యె
విమలమైనట్టి వర్షాగమమున నధిప.

18