పుట:కేయూరబాహుచరిత్రము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

కేయూరబాహుచరితము

గీ. సుప్తుం డగుచుండి వానరుఁ జూచి నన్ను
     డాయవచ్చిన జీవుల వేయు ఖడ్గ
     ధారఁ దునియంగ నని చెప్పి కూరె నిద్రఁ
     గపియుఁ బనిపూని భూపతిఁ గాచియుండె.299
వ. ఆసమయంబున.300
మ. సుమనోదామము రాజుకంధరమున్ శోభిల్లు నత్తావికై
     భ్రమరం బొక్కటి మూఁగ దానిఁగని కోపవ్యగ్రమై క్రోఁతి ఖ
     డ్గమున న్వేసినఁ దేఁటితోన ధరణీకాంతావతంసంబుకం
     ఠము రెండయ్యె వినీతుఁ డైన పతిచేష్టల్ చేటు దేకుండునే.301
వ. వివేకి యైన చోరుండు శత్రుం డైన విప్రుం గాచిన విధంబె ట్లనిన.302
గీ. నందినీనామనగరంబునందుఁ గలఁడు
     బంథుకుం డనియెడునొక బ్రాహ్మణుండు
     ధనికుఁ డట తొల్లి యవిలంఘ్యదైవఘటనఁ
     బిన్నలై పుత్రులుండంగఁ బేదవడియె.303
వ. అప్పుడు.304
మ. కటబద్ధాంబరఖండమృత్పటలికాక్రాంతస్తనోపాంతికన్
     జటిలాపింగళ కేశభారఁ బ్రణితోష్ఠద్వంద్వదీనాననన్
     కటకస్థానపరీతరజ్జువలయం గాత్రస్తమాలీన ను
     త్కటబాష్పాక్షుఁడు చూచె బంధుకుఁడు దుఃఖవ్యూహినిం గేహినిన్.305
వ. అట్లు చూచుచు నాత్మగతంబున.306
మ. బలవద్దైన్యము వక్త్రగహ్వరముగాఁ బల్చోట్లఁ గొన్నట్టియ
     ప్పులు మైచాఱలు గాఁగ బాలరుదితంబు ల్మ్రోగుట ల్గాఁగ దు
     ర్నిలయారణ్యములో భయప్రకరమూర్తి క్రూరమై యుండఁగాఁ
     దలమే వెల్వఁడఁజేయ లావుకలిమిన్ దారిద్ర్యశార్దూలమున్.307
ఉ. ఐనను దీనిఁ బాపఁదగు యత్నము చేసెదఁగాక చిత్రవ
     ర్ణీనగరంబులో గుణగరిష్ఠుఁడుఁ బూర్ణధనుండు నై మదీ
     యానుజుఁ డున్నవాఁడు విపులాఖ్యుఁడు వానికి సొమ్ముగల్గఁగా
     నే నిటు బీద నైనవిధ మిచ్చ నెఱింగిన వాఁడు కుందఁడే.308
వ. అతం డొసంగు కనకము గొనివచ్చి యిచటం గర్షకుండ నయ్యెద.309