పుట:కేయూరబాహుచరిత్రము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

49

సీ. ఈలోక మింతయు నాలుగుపాళు లిందొకట భిక్షుకులు సోమకులు నొక్క
     పాలు సేవావృత్తి బ్రదికెడువారు విద్యోపజీవికులును నొక్కపాలు
     వ్యవహారమాడెడువారుఁ దస్కరులును నొకపాలు కర్షకు లొక్కపాలు
     మొదలిపాళ్ళు మూఁడుఁ బిదపటిపాలిన యనవరతంబును నపహరించు
గీ. నపహరించియు నంతంత కవి నశించు, నపహృతం బయ్యు నది వృద్ధి నందుచుండు
     గానఁ దగురాజు గలిగినఁ గరిసనంపు, జీవనముఁ బోల దొండొకజీవనంబు.310
క. అని తలఁచి కదలి కతిపయ, దినముల ననుజపురి చేరి తెరువున డస్సెన్
     దనువు మును బేద యై నలి, గినమానముకంటె మిగులఁ గృశమై యుండన్.311
మ. అనుజాగారముఁ జేరవచ్చిన నతం డల్లంతఁ దా నగ్రజుం
     గని సందేహము వొందియున్ గమనరేఖామాత్ర శోధించి క
     న్గొని కన్నీరునఁ బాదము ల్గడిగి సమ్మోదమ్ముతో నెత్తి దీ
     వన డగ్గుత్తిక డింద నాతఁ డదిమె న్వక్షంబుతోఁ దమ్మునిన్.312
వ. తదనంతరంబున.313
క. విపులుం డగ్రజునకుఁ దగు, నుపచారంబులు ప్రమోద ముత్కటముగ ని
     క్కపుభక్తిఁ జలిపి యాతఁడు, విపన్నుఁ డగు టతనిచేత విని దుఃఖితుఁ డై.314
వ. నిజపుత్రకళత్రసహితంబుగా నాతని నిష్టదేవతానిర్విశేషంబున నారాధించుచుండ
     నొక్కమాసంబు చన బంధుకుండు తమ్మునితో నొకనాఁటిరాత్రి యెల్లి యవస్యం
     బునుం దనకుఁ బయనంబు సేయవలయు నని నిర్బంధించి పలికిన నర్ధరాత్రసమయం
     బున నవ్విపులుండు దనయంగణంబున గతపరిసాంద్రమాధవీలతాచ్ఛన్నం బగుచూ
     తకుంజంబుక్రిందికిం బూర్వజుం దోడ్కొని యేగి వేకువన యతనిపయనం బగుట
     దన్నిమిత్తంబు లగు మాటలాడి.315
క. కొనిపోవరాదు తెరువునఁ, గనకము తెక్కలిఘనంబు కాకున్నను మో
     నను రాదు పెద్దహేమం, బని యన్నకుఁ దెలియఁ జెప్పి యకుటిలమతియై.316
వ. అనేక నిష్కసహస్రమూల్యం బగునొక్కమాణిక్యం బతనికి మ్రింగ నిచ్చి మీరు
     ప్రభాతకాలంబున జీర్ణమలినాంబరంబులు ధరియించి యరుగునది యని చెప్పి యి
     రువురు శయనస్థానంబుల కరుగుటయు.317
క. వారలపలుకులుఁ దద్వ్యాపారంబులుఁ దెలియనెఱిఁగి ప్రమదహృదయుఁడై
     చోరుం డొకరుం డచ్చటి, భూరుహమున నుండి వారు పోయినవెనుకన్.318
ఉ. కన్నము పెట్టఁ జన్న నొకకందముఁ జేతయుఁ గాక యున్చి దా