పుట:కాశీమజిలీకథలు -09.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగన్మోహనుని కథ

101

నీవుజూచిన పక్షి యాపారావత శకుంతము జాతిది. అది యేజాతి విహంగమో యెవ్వరు పోల్చలేకపోయిరి. భూలోకములో నాపక్షిజాతి యుదయించుట కదియే మొదలు. ఇది నాకలోక పతగ సంతతి యగుట నీకు దానిరూపము, పలుకు, మిక్కిలి విస్మయము గలుగజేయుట నిట్టివింత యెన్నడును జూడలేదని యడిగితివి. నీవడిగిన ప్రశ్న మూరకపోవదు. మంచికథ పొడచూపినది వింటివా! అని చెప్పిన గోపకుమారుండు అయ్యగారూ! మీయనుగ్రహ మిందులకు గారణము. ఈకథ నాహృదయమున కధికానందము గలుగజేసినదని స్తుతియించెను. వారు మఱునాడు లేచి తదనంతరనివాసమున కరిగిరి.

187 వ మజిలీ

జగన్మోహనుని కథ

మ. సురలోకంబున నాకలోకమున రక్షోలోకమందైన సా
     గర మందైనను భీకరాటవుల దుర్గస్ఫారవిశ్వంభరా
     ధరవర్గంబులనైన దుష్కరదురంతవ్యాప్తి నొప్పారినన్
     స్థిరసంకల్పుల కార్యముల్ జగతి సిద్ధించుం బ్రయత్నంబునన్.

వ. వత్సా! ఆనందకాననంబు, అవిముక్తంబు, మహాశ్మశానంబునను పేరులం బ్రసిద్ధినొందిన శ్రీకాశీనగరంబునకు మన మఱుగుచుంటిమి. నేఁ డీప్రదేశంబున మి మ్మడుగఁ దగిన విశేష మేదియుఁ గనంబడలేదు. వారణాశీపురప్రభావద్యోతకంబగు వింతకథ యేదేని యానతీయుఁడని యడిగితివి. సంతసం బయ్యె. మణిప్రభావంబున నంతఃకరణమునకు నొకపక్కని కథ గోచరముఁ జేసికొంటిని. అది మున్ను నీవు విన్న వానికన్నఁ జాల చమత్కృతిగా నుండు నవహితుండవై యాలింపుము.

క. కావేరీ తటమున శో
   భావిలసితమగుచు నొక్కపట్టణవర మిం
   ద్రావతి యనఁదగు భూసుర
   భూవరవిట్శూద్రలలిత భూశోభితమై.

అప్పట్టణంబున కధినాయకుండై యింద్రమిత్రుండను రాజు మహేంద్రవైభవంబున రాజ్యము చేయుచు రూపజితలతియగు మలయవతి యను సతియందు నుచితకాలమునఁ ద్రిభువనాశ్చర్యకరసౌందర్యంబునం బొలుపొందు నందనుంగని యప్పట్టికి జగన్మోహనుండను పేరుపెట్టి యిట్టట్టనరాని వేడుకలతోఁ బెనుచుచుండ నా బాలుండు శుక్లపక్ష శర్వరీపాలుండు వోలె దినదినాభివృద్ధి వడయుచుండెను. పూర్వము నుండియు క్షత్రియులకు ధాత్రీసురులే మిత్రులయి మంత్రులయి యొప్పుట వాడుక