పుట:కాశీమజిలీకథలు -09.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

    సచివుండ సుమతినా జనులాడ నేను నీ
                  మధువర్మ కపట దుర్మంత్రరతుడు
    మందపాలుడు చాల మంచివాడేకాని
                  జెడియె నీతనిమైత్రిజేసి వీరు
    కడు నధర్మంబున గైకొని రితని రా
                 జ్యంబు కుటుంబ నాశనముజేసి
గీ. దైవకృప నీతడు కిరాత ప్రభుత్వ
    పదవి వర్థిల్లి యట గుటుంబస్థు డగుచు
    నొప్పు నాతని సుతు వీర లూరకిందు
    బద్దుజేసిరి నిప్పొడి బడినట్లు.

దానంజేసి యీ సంగరంబు ప్రవర్తిల్లినది. ఈ నృపతు లిద్దరు తాము గావించిన పాపమునకు ఫలం బనుభవింపగలరు.

క. ఒరుల సిరికాస పడి యె
   వ్వరు పాపపు భీతిలేక పరహింసా త
   త్పరు లగుదరొ చెడుదురు త
   న్నరు లిందులకిల నిదర్శనము వీరెకదా?

అని యుపన్యసించిన విని పౌరులు జయవిజయపాల మహీపాలా! అని కేకలువైచుచు నతండు తిరుగా సింహాసన మలంకరించినందులకు దమసంతోషము వెల్లడించిరి. క్రమంబున నావార్త విని యదివరకెందుండిరో కానిపించని రాజబంధువు లందరు రా దొడంగిరి. విజయపాలుం డాదిత్యవర్మను వెండియు మంత్రిగా జేసికొని శత్రురాజుల రాజ్యములు రెండును వశముజేసికొని పాలించుచుండెను.

శ్రమణి రాజవాహనునితో గనకలతిక తనకు గావించిన యుపకారము లోనగు వృత్తాంత మెఱింగించుటయు నతండు సంతసించుచు నాదిత్యవర్మకుం జెప్పి తండ్రిగారి యనుమతిపై దొలుత గల్పలతం బెండ్లియాడి తరువాత గనకలతికం బరిణయమై యిరువురు భార్యలతో నానందసాగర కల్లోలముల దేలియాడుచుండెను.

విజయపాలుడు ఆదిత్యవర్మవలన శ్రమణి యాశయము దెలిసిగొని దుర్గానగరాధీశ్వరుని కుమారుడు సునందునకు శ్రమణినిచ్చి వివాహము గావించెను. కనకలతిక చుట్టరికంబునుంబట్టి మందపాలుని చెఱ దప్పించి యతని రాజ్యమిచ్చివేసిరి. మిక్కిలి దుర్మార్గుడగు మధువర్మను యావజ్జీవము చెఱసాల నుండజేసి యతనిరాజ్యము లాగికొని పాలించుచుండిరి.

గోపా ! జయంతుడే రాజవాహనుడు. శాపాంతముదనుక దివిజసుందరులం గేలిసేయు నిరువురు భార్యలతో గూడికొని పారావత శకుంతముల నుపలాలించుచు స్వర్గసౌఖ్యంబుల నపహసించు భూలోక రాజ్యసుఖంబుల ననుభవించుచుండెను.