పుట:కాశీమజిలీకథలు -09.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రమణి కథ

99

రాజవాహనా! నీమాటలు వేరొకరీతి సూచించుచున్నవేమి? మా రాజపుత్రిక నిన్ను బ్రాణబంధువునిగా నిశ్చయించుకొని తండ్రి పరాభవమునకు గూడా ననుమతించినది. ఈమె యభిలాషదీర్పక దప్పదని పలికిన విని శ్రమణి నవ్వుచు నేమియు మాటాడినదికాదు. ఆ రాత్రియెల్ల సరససల్లాపములతో గాలక్షేపము జేసిరి.

మఱునా డుదయము గాకమున్న శ్రమణి యశ్వరూఢయై పోవుటకు బ్రయత్నించుచుండ గనకలతిక పుష్పదామంబు మెడలోవైచి లాగుచు మనోహరా! నిన్ను నేను బోవనీయను నాకిచ్చినవరము చెల్లింపుడు మిమ్మే భర్తగానెంచి తలిదండ్రుల విడిచి మీకడ కరుదెంచితిని. ఇక దాచనేల? నా యభీష్టము తీర్చకున్న గదల నీయనని నిర్బంధింపగా శ్రమణి తిరుగావచ్చి నీయభీష్టము తీర్తునని చేతిలో జేయివైచి యుద్ధరంగమునకు బోయెను. అందు గొప్పయుద్ధము జరుగుచుండెను.

మొదట వసుపాలుని సేనల శత్రుబలమనుకొని భిల్లవరులు వారితో బోరిరి. కొంతసేపటికి రాజవాహనుడు వారు తమవారని తెలిసికొని యుభయసైనికులకు మైత్రి గలిపి శత్రువీరుల మర్దింపజేసెను.

రాజవాహనుడు సర్వసేనాధిపత్యము వహించి తురగారూడుండై యెక్కడ జూచిన తానయై శత్రుబలసంహారము గావింపుచుండెను. ఇంతలో శ్రమణి యన్నగారిం గలిసికొని సంజ్ఞాపూర్వకముగా దనరాక దెలిపి సంతోషము గలుగజేసినది. ఇరువురు రెండుయామములలో శత్రుబలముల బీనుగుపెంటల గావించిరి. ఇంతలో దుందుభి బిడ్డలగలిసికొని సంక్షేపముగా వారి వృత్తాంతమువిని యానందించుచు సమరోత్సాహముతో శత్రువీరులపైబడి మారిమసంగినట్లు నాశనము జేయుచుండెను. వారి సమాగమము దెలిసికొని ప్రచ్ఛన్నుడైయున్న యాదిత్యవర్మయు వారిం గలిసికొనియెను.

ఆ నలువురు వీరులు అసంఖ్యాకములైన మూలకముతోగూడికొని శత్రుబలంబుల దరిమికొనిపోయి కోటముట్టడించిరి. జయ, విజయపాలా! అను కేకలు నింగిముట్ట గోటలో బ్రవేశించి శత్రునృపతుల నిరువుర బారిపోవ బ్రయత్నించుచుండ బట్టుకొని బంధించిరి. ఆహా! కాల మేకరీతిగా నెవ్వరికిం జరుగదు. సుఖదుఃఖములు చక్రములవంటివి. వెనుక విజయపాలునికి బట్టినయవస్థ శత్రురాజుల కిప్పుడు పట్టినది.

ఆకోట స్వాధీనమైన తరువాత నందొకసభ జేసి పౌరులనెల్ల రప్పించి శత్రురాజుల నిరువుల ఱెక్కలు విరిచికట్టించి యెదుర నిలువబెట్టించి దుందుభిని సింహాసనంబున గూర్చుండబెట్టి యాదిత్యవర్మ యిట్లుపన్యసించెను.

సీ. వినుడీ మహారాజు విజయభూపాలు డి
                    తనబిడ్డ లీ ధనుర్థరు లిరువురు