పుట:కాశీమజిలీకథలు -09.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

డితిని. అతండు దైవికముగా మనయింటికే వచ్చెనని యా కథనంతయు నెఱింగించినది.

అప్పు డుబ్బుచు నబ్బిబ్బోకవతి పొలఁతీ! బండిలో నీవెంట నేనందువచ్చెద నన్నందుఁ దీసికొనిపొమ్ము. నాఁడు వాని సోయగము తొందరగాఁ జూచితిని. ఇప్పుడు సావకాశముగా మాట్లాడుకొనవచ్చునని చెప్పుటయు నది యందులకే నేనిందు వచ్చితినని పలుకుచు మారువేషము వైచి బండిలోఁ దన యింటికిఁ తీసుకొనిపోయినది.

ఆ పరిచారిక బండిదిగి ముందుగాఁ దాను లోపలికిఁ బోయినది. శ్రమణి దానింజూచి యువతీ! వీథిలోని విశేషములు దెలిసికొంటివా? అని యడిగినది. తెలిసికొంటి ఆ నృపతులలో మందపాలుని కూఁతురు మీ దర్శనమునకై వచ్చినది. మీకు సంధిఁ జేయునట. అని పలికిన శ్రమణి ఏమియు మాటాడక యూరకుండెను.

అప్పుడు రాజపుత్రిక వచ్చి శ్రమణికి నమస్కరింపుచు దాను దెచ్చిన పుష్పమాలిక యాకలికి మెడలో వైచినది. జ్ఞాపకముంటినా? నేనెవ్వరో చెప్పుకొనుడు. అనుటయు, జిరునగవుతో నేను మీయుపకారము మరచిపోవుదునా? నన్నుఁ గృతఘ్నునిగా దలంపకుడు. నాకార్యము దీరిన వెనుక మీ యిష్టము వచ్చినట్లు నడిచెదనంత దనుక తొందర పెట్టవలదని తత్సమయోచితముగా మాట్లాడెను.

రాజపుత్రిక శ్రమణితో ముచ్చటించుటయె గ్రీడించినట్లు సంతోషించుచు నెపము పన్ని పల్కరించుచు శత్రుమర్మముల నెఱింగించు కారణంబున సంభాషించుచు శంకించి యుత్తరములు వడయుచు మూఁడు దినము లందేయుండి యానందించుచుండెను.

పరిచారిక యెప్పటికప్పుడు వీథిలోనికిఁబోయి శత్రురహస్యములఁ దెలిసికొని వచ్చి చెప్పుచుండునది. ఒకనాఁడు సాయంకాలమున వసుమతి గుండెలు బాదుకొనుచు వచ్చి కనకలతికతో రాజపుత్రీ! అమ్మయ్యో! కిరాతసైన్యములు కోటానకోటులువచ్చి మనపట్టణ ముత్తరదెస ముట్టడించినవి. దక్షిణదెస మఱియొకరాజెవ్వడో వచ్చి యావరించెనట. మనరాజు లిద్దరు తమ సేనలచే బోరించుచు బారిపోవుటకు బ్రయత్నించుచున్నారట. ఏ వీథిజూచినను భిల్లవీరులే కనంబడుచున్నారు. పౌరులు తలుపులు మూసికొని వీథిలోనికి వచ్చుటకు వెరచుచున్నారు. నీవిక మీయింటికి బోవలయు నేమియుపద్రవము జరుగునో తెలియదని రహస్యముగా కనకలతికతో జెప్పు చుండగ విని శ్రమణి పరమసంతోషముతో నిట్లనియె.

మీకు వెఱువవలసిన బనిలేదు. మీరాజుల కెట్లును రాజ్యము దక్కదు. మిమ్ము నేను గాపాడెదను. మీరు నాకు గావించిన మేలు మరచిపోవుదునా? అని పలికిన వసుమతి యిట్లనియె.