పుట:కాశీమజిలీకథలు -09.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుళిందుని కథ

77

    వచ్చె మృగయావినోద లంపట మనీష
    శబరకులవీరు లుభయపార్శ్వమ్ముల నడువ.

శృంగారవీరరసంబులు మూర్తీభవించినట్లు మెఱయుచు నప్పుళిందకన్య యాదారిం బోవుచు నా చెట్టు నీడ గాఢనిద్రావశంవదుండై యున్న యన్నరేంద్రపుంగవుం గనుంగొని వెఱఁగుపాటుతోఁ దన గుఱ్ఱమును నిలిపి తదీయరూపరేఖావిలాసము లాసక్తిం బరీక్షించి యతండొక చక్రవర్తియని నిశ్చయించి యట్టె నిలువంబడి చూచుచుఁ దన పరిజనులచే నతని మేని చెమ్మటలు వాయఁ గొంతసేపు విసరించినది. చల్లనినీరు మోముపైఁ జల్లించినది.

అప్పు డతండు మేను జల్లఁబడ హాయి హాయి యని పలుకుచు మెల్లన లేచి నలుమూలలు చూచి తన కుపచారము సేయుచున్న కిరాతభటుల పరికించి మీ రెవ్వరు ? ఇందేల వచ్చితిరని యడుగుటయు వాండ్రు సామీ! మీ మాయమ్మ పరిజనులము. ఆమెతో వేటకై యీ యడవికి వచ్చితిమని చెప్పుచుండ నొకదెస నసదృశరూపయౌవనవిలాసములచేఁ బ్రకాశింపుచుఁ దురగారూఢయై యున్న యాయన్నుమిన్న గనంబడుటయు నతం డాశ్చర్యవిస్ఫారితేక్షణుండై యట్టెలేచి యా చకోరాక్షి సమక్షమునకుం బోయి,

క. పరనాథకన్యకవొ కి
   న్నర విద్యాధర సుపర్వ నాగాది వియ
   చ్చర కన్యకవో నీవో
   తరుణీ వివరింపు మది ముదంబు వహింతున్.

నీరూపంబు త్రిభువనమోహజనకంబై యున్నది. నీవేషంబు అటవికంబు నాగరకంబు సూచించుచున్నది నీ నివాసదేశం బేది? నీ తలిదండ్రు లెవ్వరు? నీ వృత్తాంత మెఱింగింపుమని యడిగిన నగ్గరిత దిగ్గున గుఱ్ఱంబు డిగ్గ నురికి వారువమును జేరఁబడియె. లజ్జావనతవదనయై తత్ఖలీనముజేతం బట్టికొని కదుపుచుఁ బురుషోత్తమా! నన్ను బెద్దగాఁ బొగడుచుంటివి. నేనొక వనచరకుమారికను, నన్ను ధేనుక యండ్రు. మాతండ్రికి మన్యప్రదేశమునఁ గొన్నిగ్రామములు గలవు. ఆ ఖేటనమే మాకు జీవనము. మా గ్రామ మిక్కడికిఁ బదియోజనముల దూరములో నున్నది. చిన్నతనమునుండియు నాకీ వేట యలవాటుఁ జేసియున్నారు. దానంజేసి యడవులం దిరుగుచుందును. నేఁటి రాకవలన మీ దర్శనమైనది. కన్నులకలిమి సార్థకమైనది. మీయాకారము ప్రభుత్వచిహ్నముల సూచించుచున్నది. ఈ మహారణ్యమధ్యంబునకుం బాదచారులై యేమిటికి వచ్చితిరి? మీ కులశీలనామంబు లెట్టివో వివరించి నాకు శ్రోత్రానందము గావింపుఁడని యడిగిన నమ్మహారాజు నానందముగా నిట్లనియె.

తరుణీ! అరణ్యకత్వము నీమాటలయం దెక్కడను గాన్పింపదు. నీ వాగ్నైపుణ్యము నీ విద్యాపాటవమును తెలుపుచున్నది. నిన్నుఁ జూచి భవదీయమధుర