12
కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము
నందు, విలువిద్యయందు నిత్యము సాధనముఁ జేయుచుండును. అప్పుడప్పుడు తండ్రితో బ్రాంతారణ్యముల కరిగి వారు వేటపాటవముగూడ నేర్చుకొనుచుందురు. రాజవాహనుఁడు పదునాలుగేడులు పూర్తికాక మునుపే విలువిద్యలయందు, మృగగ్రహణమునందు, గజాశ్వారోహణల యందుఁ దండ్రికంటె నధికుండయ్యెనని వాడుక వచ్చినది.
నిషాదపుత్రుఁడు సింహశార్దూలాది క్రూరమృగంబులకు గజాశ్వసారంగాది సాధుమృగంబులకు వైరంబు లేకుండునట్లు వానినెల్ల ఒకశాల నిలిపి యాటలు నేర్పుచుండును. శ్రమణియుఁ బక్షిశాలకుఁ బోయి శుకశారికాప్రభృతివిహంగములకు సంగీతము నేర్పుచుండును.
ఒకనాఁడు దుందుభి మృగపక్షివిశేషంబులం దీసికొనిరా శబరసేనాపరివృతుండై దూరదేశారణ్యంబులకుం బోవుచుఁ గుమారుం జీరి వత్సా! వింధ్యారణ్యంబునకు నద్భుతమృగంబులు విచిత్రపక్షివిశేషములు చాల వచ్చియున్నవని యందున్న మన పరిజనులు వార్తలం దెచ్చియున్నారు! మఱియు మన శాలలన్నియుఁ జోటుగలిగి యున్నవి. ఈ నడుమ జాల అమ్మకమైనవిగదా! నేను గొత్తవానిం దెచ్చువఱకు నిందున్నవాని నమ్మవద్దు. ఈ లోపల నెవ్వరేని వచ్చినచో వారిం గౌరవించి మరల రమ్మని చెప్పుము. అని బోధించి యతండు బలములతో వింద్యారాణ్యమునకుంబోయె.
అని యెఱిగించువఱకు వేళయతిక్రమించినది. అవ్వలికథ పైమజిలీయందు జెప్పదొడంగెను.
172 వ మజిలీ
పుళిందిని - వత్సా! రాజవాహనా! మహేంద్రపురమునుండి రాజకింకరులు దాదులు కొందఱు వచ్చిరఁట. వారిం బరామర్శించి గౌరవించితివా? మీ తండ్రిగా రూరలేనిలోపము రానీయకుమీ. వా రేమిటికై వచ్చిరి?
రాజవాహనుఁడు - అమ్మా! మహేంద్రపుర భర్తయగు పసుపాలుండను నృపాలునకుఁ గల్పలతయను గారాల కూఁతురు గలదఁట. ఆమెకుఁ బక్షిజాతులయందు చాల ప్రీతియఁట, మనయొద్దనున్న వింత శకుంతముల రకమునకు జోడువడువున నన్నిజాతిపులుగులం బంపమని యాఱేఁ డుత్తరముతోఁగూడ నూర్వుర దాసదాసీజనంబులఁ బంపినాఁడు. వారికిఁ దగిన గౌరవము గావించితిమి.
పుళిందిని - వత్సా! మీ తండ్రి గారూర లేరుగదా! నీవు వెలలెట్లు చెప్పఁ గలవు?
రాజ - అమ్మా! వెలలకుఁ బతంగసంతతి చాల కొఱంతగా నున్నది. తండ్రిగారు వచ్చినంగాని రకములు దొరకవు. ఆ మాటయె ప్రత్యుత్తరము వ్రాయుచున్నాను.