పుట:కాశీమజిలీకథలు -09.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

శ్లో. జాతిస్వభావ గుణదేశజ ధర్మచేష్టా
    బావేంగి తేషు వికలో రతితంత్రమూఢః
    లబ్ద్వాపి హి స్ఖలతి యౌవన మంగనానాం
    కిం నారికేళఫల మాప్య కపిః కరోతి.

జాతిస్వభావగుణవిశేషాదు లాగ్రంథమందుఁ జెప్పఁబడి యున్నవి.

రాజ — ఎవరిజాతిస్వభావాదులు? స్త్రీలవా, పురుషులవియా ?

అశో - ఒకరివి యొకరు.

రాజ — ఈశ్లోకములో నట్లులేదే. పురుషుఁడు స్త్రీయొక్క జాతిస్వభావగుణచేష్టాది విశేషంబులఁ దెలిసికొనవలసినదనియు నట్లు తెలియనివాఁడు రతితంత్రమూఢుఁడనియుఁ గోఁతికి గొబ్బరికాయ దొరకిన బ్రద్దలు కొట్టికొని తిననేరనట్లు స్త్రీల యౌవనముఁ బొందియుం దొట్రుపడును. అని యున్నది గదా? అది స్త్రీల కేమి యుపయోగము?

అశో - ఇంకనేమి? ఈమాత్రము పాండిత్య మున్నది గదా! చాలు కాంచనమునకుఁ బరిమళ మబ్బినట్లే. నీకు విద్యావాసన గలుగుట సంతోషమయినది. గుఱ్ఱము నిలిపెదవా నెక్కెద.

రాజ - (నిలిపి యెక్కించుకొని ముందరనే కూర్చుండ బెట్టుకొని) గుఱ్ఱము జూలు గట్టిగాఁ బట్టుకొనుము. వడిగాఁ దోలెదను.

అశో - నాకును గుఱ్ఱమెక్కు పాటవము గలదు, భయము లేదు. వడిగా దోలుము.

అనుటయు నతండు తత్తడిని వడిగా నడిపించి రెండుగడియలలో నాయడవి దాటించెను. ఆయరణ్య ముఖంబుననున్న కోయపల్లెలో దాని పరిజనులు యంత్రశకటముతో వేచియుండిరి. అక్కడ నుండి దేశముల మీఁదికి విశాలములైన రాజమార్గములు గలవు. అశోకవతి యందు గుఱ్ఱమును దిగినది. రాజువాహనుఁడును దిగి యాశకటమును బరీక్షించి చూచి వెఱఁగుపడఁజొచ్చెను ఆశోకవతి యతని నాబండిలోఁ గూర్చుండ రమ్మనియెను. అతం డంగీకరింపక గుఱ్ఱమును దానితో సమముగా నడిపించి వచ్చెదనని చెప్పెను. బండి, గుఱ్ఱము నొకసారి వదిలిరి. గుఱ్ఱమే ముందుఁ బోయి గమ్యస్థానము జేరినది. అతని యశ్వగమననైపుణ్యమునకు అశోకవతి వెఱఁగుపడినది.

176వ మజిలీ

శ్యామల కథ

పుళిందకుమారుం డశోకవతితో నరుగునప్పుడు దారిలోఁ గనంబడిన విశేషములెల్ల దాని నడుగుచుఁ దెలిసికొనుచుండును. అశోకవతియు నతనికి మార్గవిశే