298
కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము
అని యెఱింగించి యతిపతి కాలాతీతమగుటయు నవ్వలికథ పై మజిలీయం దిట్లు చెప్పం దొడంగెను.
209 వ మజిలీ
దేవకన్యావివాహముకథ
మదనమంజరి విక్రమార్క నృపసార్వభౌముం డలకాపురంబునకు వచ్చి త్రిపురసుందరి వివాహ మాడుననియు నప్పుడొక గొప్ప సభ జరుగుననియు నప్పుడు వేల్పు లందరు రావలయుననియు దేవలోకములన్నియుఁ జాటింపం జేసినది.
దానం జేసి యమ్మహారాజుం జూడ వేడుకపడుచు నా సుముహూర్తమునకు ముందుగనే గరుడ గంధర్వకిన్నర కింపురుష సిద్ధవిద్యాధర యక్ష రాక్షస ప్రభృతులు దేవతా విశేషులు స్త్రీ బాలవృద్ధముగా వచ్చి యలకాపుర మలంకరించిరి. కుబేరుండును వారి కందఱకుం దగిన విడిదెల నియమించి యాచరించెను.
మఱియు -
క. రంభోర్వశీ ముఖామర
రంభోరుజనంబు నారీష్య రమణీయ కళా
రంభోత్సాహాంచిత సం
రంభంబున వచ్చెనమర రాజనుపంగన్,
ఉ. వీణెలఁమూని వచ్చిరరవింద భవప్రభవుండు గానవి
ద్వాక నిపుణుండు తుంబురుఁ డుదారయశోనిధి విక్రమార్కభూ
జాని వివాహ లగ్న దివసంబునఁ దన్మహనీయ సాహసో
పానమిత ప్రతాప సుగణాదుల గానముసేయు వేడ్కతోన్.
వివాహలగ్నం బాసన్నం బగుడు కుబేరుని తమ్ముఁడు మాణిభద్రుఁడు మదనమంజరీ ప్రబోధితుఁడై నాకంబునకరిగి దేవేంద్రు నడిగి మాతలి సారథికంబగు రథంబు దీసికొని భూలోకంబునకుంబోయి విక్రమార్కమహారాజుం గాంచి లగ్న పత్రిక నిచ్చి విచ్చేయుమని ప్రార్థించుటయు నమ్మహారాజు ఆహా ! వేల్పులెల్ల నన్నుఁ బెద్దఁజేసి యాహ్వానించుచున్నారు. నేనబ్బుండనైనను దద్దయాపాత్రుండనగుటఁ బవిత్రుండనని తలంచుచుంటి నెట్లయిన నమ్మహాత్ములంగాంచి కృతార్థుఁడ నగుటయే లెస్స యని యాలోచించుచు నవ్విమానమునకుఁ బ్రదక్షిణముజేసి మాతలి దత్తంబులగు దివ్యమాల్యానులేప నాంబరాదులు ధరించి సమధికతేజోవిరాజమానుండై యక్కాంచనరథ మెక్కి యొక్క గడియలో నలకాపురంబున కరిగెను.
శంఖారావ భేరీమృదంగాది మంగళ నినాదముతో నతనికి సీమాప్రవేశమున నిదారు సన్నాహము గావించి వేల్పులెల్ల నతండు వలదనుచుండఁ బలవంతమున రతనంపు కెంపుల పల్లకీలోఁ గూర్చుండఁబెట్టి తాము పాదచారులై ముందె నడచుచు రంభోర్వశులు నృత్యము సేయ దుంబురుండు వీణ మేలగింపఁ గిన్నరులను వదింప