పుట:కాశీమజిలీకథలు -09.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

నా వృత్తాంత మంతయు నెఱింగించుటయు నా బ్రహ్మరాక్షసుఁడు వెఱఁగుపడుచు నిట్లనియె.

సరే, నీ మాట కంగీకరించితి. నేఁటి కైదవనాఁడు రాత్రి రావలయు. నట్లు రాకపోయిన నాయాన సుమీయని యొట్టుపెట్టెను. నే నంగీకరించితిని. పోపొమ్మని బ్రహ్మరాక్షసుఁడు నన్ను విడిచివైచెను. అప్పుడే బసలోనికిఁ బోయి యారహస్య మెవ్వరికిం జెప్పక వారితో గలసి మఱునాఁడు రత్నపాదుని యగ్రహారమునకుఁ బోయితిని.

రత్నపాదుండు మా కెదురు సన్నాహము గావించి మిగుల వైభవముతో విడిదెలోఁ బ్రవేశ పెట్టెను. నారూపముజూచి కన్యాదాతయేకాక తద్బంధుజనమంతయు మిగుల సంతోషించెను. రూపవతి సఖురాండ్రిరువు రరుదెంచి విడిదెలో నన్నుఁజూచి తమ సంతోషమును వెల్లడించుచు నన్నుఁ బల్కరించి నావిద్యను బరీక్షించి మెచ్చు కొనుచు నరిగిరి.

అంత నాకు స్నాతకమహోత్సవము జరిగించిరి. ఆ రాత్రియే వివాహము గావించిరి. రత్నపాదుఁడును భాగ్యవంతుడగుట షోడశమహాదానములు జేయుచు శాస్త్రవిధి రూపవతిని నాకుఁ గన్యాదానము గావించెను.

మేళతాళములతో నూరేగింపులతో నుత్సవములతో విందులతో నైదు దినములు నాయగ్రహారము బ్రాహ్మణ జనసంకులమై యొప్పినది. నావివాహము సీతాకళ్యాణమువలె జరిగినదికాని నాకు మాత్రము సంతోషము లేదు. దివసములు గతించిన కొలది చింత యెక్కువ కాజొచ్చినది.

దీక్షావసానదివసంబున మాకు సమావేశమహోత్సవము గావించిరి. రూపవతి రతికన్నఁ జక్కనిది. దాని చెలికత్తెలు మిగుల నందకత్తెలు. మా వధూవరుల చక్కఁదనము ముచ్చటగాఁ జూచుచుఁ బేరంటాండ్రు పాటలు పాడుచుఁ బెద్దతడవందు విడిచి పోలేకపోయిరి.

స్త్రీజనము మా గృహము విడిచిపోయిన తరువాత రూపవతి తలుపుచెంత నిలువంబడినది. జగన్మోహనమగు నమ్మగువ సోయగముజూచి నేను చింతాశోకసమాక్రాంత స్వాంతుండనై యంతలో ధైర్యము దెచ్చుకొని మంచముదిగిపోయి యా యిందువదన చేయిపట్టుకొని తల్పము దాపునకుఁ దీసికొని వచ్చితిని.

ఆ పల్లవపాణి యా ప్రాంతమందున్న పీఠముపై గూర్చుండిఁ సారెలు సవరించుచు హాయిగా వీణ పాడినది. ఆ గాన మాలించినంత నా హృదయము నీరై పోయినది. తల్పంబునంబండుకొని యట్టె ధ్యానించుచుంటిని. నిద్రఁబోయి నట్ల భినయించితి ఆ కాంత కొంతసేపు సంగీతముపాడి నేను నిద్రబోవుచున్నానని తలంచి నాకు నిద్రాభంగము గాకుండ సద్దుఁజేయక మెల్లగావచ్చి నా ప్రక్కను బండుకొని కపటనిద్రం బోవుచుండెను.