276
కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము
206 వ మజిలీ
కేసటుని కథ
విక్రమార్కుం డుత్తరాభిముఖుండై యరుగుచు నొకనాఁడు నర్మదాతీరంబుఁ జేరి యందు వాఱువము దిగి నీరు ద్రాగించుచున్న సమయంబున నాప్రవాహములో నొకపురుషుఁడు కొట్టుకొని వచ్చుచుండెను. వానింజూచి యతం డార్తుం డయ్యెనని తెలిసికొని య భూభర్త తటాలున నత్తటంబు దిగి నదిలో నీదికొని పోవుచు నతనిం బట్టుకొని యొడ్డునకు లాగుకొని వచ్చి విశ్రమింపఁ జేసెను.
దివ్యాలంకారసమచితుఁడగు నాయువకుం జూచి యతండు నీ వెవ్వఁడవు ? ఈ పసుపు పుట్టములతో నీ నదిలో నేమిటికిఁ బడితివి? నీ వృత్తాంతముఁ జెప్పమని యడిగిన నాపురుషుం డాయాసము తీరినవెనుక నిట్లనియె.
సౌమ్యా ! నీవు నన్ను బ్రతికించితివి ఇఁక రెండు గడియలు దాటిన నేను మృతినొందువాఁడనే నే నీనదిలోఁ కొట్టుకొని పోవుచుండఁ దటస్థులై యూరక చూచుచుండిరి. కాని యిట్టి సాహస మెవ్వరు జేయలేక పోయిరి. నీవు మిగుల పుణ్యాత్ముఁడవు. నా వృత్తాంత మాలింపుము. నా కాపురము పాటలీపుత్రనగరము. నేను యౌవనము పొడసూపినంతఁ గులశీల సంపన్న యగు భార్యం బడయుటకై తలిదండ్రుల యనుజ్ఞ గైకొని దేశాటనముఁ జేయుచుంటిని.
ఒకనాఁడు నర్మదానదీతటంబునం గూర్చుండి ప్రవాహవిశేషముల నరయుచుంటి. నింతలో నొక యోడలోఁ బెండ్లి వారు కొందఱరుదెంచిరి. వారు తీరమునఁ దిగి కాల్యకరణీయములఁ దీర్చుకొనుచున్న సమయంబున వారిలో నొక బ్రాహ్మణుఁడు నాకడ కరుదెంచి మదీయకులశీలనామంబు లడిగి తెలిసికొని రహస్యముగా నిట్లనియె.
సుందరుడా ? నీవలన నాకొక యుపకారము గావలసియున్నది. అది చేయుదునంటివేని వక్కాణించెద. దానివలన నీకేమియు హాని రాఁజాలదు. అని యడిగిన నేను ఆర్యా! నాచేతనైన పనిచేయఁగలను. నిస్సంశయముగాఁ జెప్పుమని పలికిన నతం డిట్లనియె.
సౌమ్యా! నీవెంత చక్కనివాడవో యంతరూపహీనుఁడగు కుమారుండు నాకుదయించెను. దొప్పచెవులు దోనెకడుపు పిట్టగుడ్లు చెప్పిదవటలు గూనివీపు లొట్టచేతులు చెప్పవలసిన దేమి యున్నది. ఎన్ని యవలక్షణము లున్నవియో అన్నియు నా కుమారునందు వెలసి యున్నవి. నాకు భాగ్యము చాలఁ గలదు. ఒక్కఁడే కొడుకు కావున వాని కురూపత్వ మెవ్వరికిఁ దెలియకుండ రహస్యముగా దాచి కాపాడు చుంటిమి.
నేను రత్నదత్తుఁడను బ్రాహ్మణుని యెడకుఁ బోయి నా కుమారుఁడు