పుట:కాశీమజిలీకథలు -09.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విక్రమార్కుని కథ

179

డించు ముద్దుగుమ్మల నిద్దరం బెండ్లిఁ జేసి దేవకాంతాసంభోగోత్సుకవిముఖునిఁ కావించెను. మఱియు మోహనుండు చంద్రిక తండ్రియగు భీమవర్మను రప్పించి తమ వృత్తాంత మంతయుం జెప్పి యతనికిం గూఁతునం దనురాగాంకురము గల్గునట్లు జేసెను. విద్యావతి ప్రాగ్జన్మసంబంధబాంధవ్యంబునం జేసి తల్లిదండ్రుల నాదరించుచు వారి మన్ననలం బడయుచుండెను. ఇష్టము వచ్చినప్పుడు నిరృతి లోకములోనికి బోయి వచ్చుచుండును. మోహనుం డట్లిరువురు భార్యలతో మిత్రునితోఁ బంధువులతో నాకభోగంబు లనుభవింపుచు బెద్దకాల మారాజ్యము పాలించెను.

అని యెఱిగించి మణిసిద్ధుండు గోపా! ఈ కథవలన గాశీమహాత్మ్యంబు దెల్లమైనదా? యని యడిగిన వాడురమున జేయివైచికొని స్వామీ! కాశీమహిమం బెంత వింతగా నున్నది? ఆహా? ఎక్కడి కపిల? యెక్కడి చంద్రిక? యెక్కడి దేవత్వము? విచారింప నిందు మోహనుని ప్రజ్ఞ యేమియు గనంబడదు. వారిద్దరు గంగలోబడి మృతినొందుచు వానినే పతి గావలెనని కోరుటచే మోహనుని కాభోగము పట్టినది. లేనిచో సిద్ధార్థునికైన పరాభవమే యైతీరును.

అయ్యగారూ! మన మింక గాశీపురం బెన్నినాళ్ళకు బోవుదుము. ఎప్పుడు గంగలో మునుంగుదుము? మనముగూడ నోడదాటునప్పుడు నావ మునిగిన బాగుండును. చెరియొక పుణ్యలోకము బాలింతుమని పలికిన నవ్వుచు నాజడదారి యిట్లనియె.

వత్సా? మనకట్టి తుచ్చభోగము లేటికి? ఆ వృత్తిరహితమైన కైవల్య మందుదుముగాక. కాశీపురము కల్పవృక్షము కాదా? ఎవరి కోరిక యెట్లుండునో యట్టి సంతోషంబు గూర్చును. ఇక కొలదిదినములలో నాయూరు జేరగలము. అందు జేరి మోక్షలక్ష్మి బడయగలమని పలుకుచు శిష్యు సంతోషపరచెను.

తదనంతరంబ.

ఉ. కావడి యెత్తి వాడు వెనుకం జనుదెంచుచు మున్ను విన్న నా
    నావిధసత్కథల్ మనమునం దలపోయుచు దచ్చమత్క్రియా
    భావము లెన్నుచుండ బ్రణవంబు జపించుచు దీక్షమోక్షల
    క్ష్మీవిభవప్రమోది మణిసిద్ధుడు ముందరుగున్ పథంబునన్.

197 వ మజిలీ

విక్రమార్కుని కథ

క. చంద్రాననార్ధగాత్రా । చంద్రాంశుశ్వేతభూతిచర్చితగాత్రా
   చంద్రార్కానలనేత్రా । చంద్రార్థజటావిచిత్ర సాధుచరిత్రా॥

దేవా! అవధరింపుము. మణిసిద్ధుం డమ్మజిలీయందు గాల్యకరణీయంబులం దీర్చుకొని భోజనానంతరంబున దనచెంత వినయమితోత్తమాంగుడై నిలువంబడియున్న గోపకుమారుం గాంచి చిఱునగవుతో నిట్లనియె.