పుట:కాశీమజిలీకథలు -09.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

రాజ -- ఏతీగపైనే వ్రేలెట్లు నొక్కవలయునో నాకుఁదెలియదు. నీచేతితో నావ్రేళ్ళు పట్టుకొని తీగలపైనొక్కి పలికింపుము.

సుమ - అయ్యో! బొత్తుగా వీణాపరిశ్రమ లేనిదానివలెఁ జెప్పుచుంటివే? ఓనమాలు గూడిఁ జెప్పవలయునా యేమి?

రాజ - తప్పక చెప్పవలయు; నేనంతయు బరవశనై మరచిపోయితిని.

సుమ - పరవశత్వ మేల ?

రాజ - నిన్నుఁ జూచుటచే నీవయసు, నీరూపము, నీగుణంబులు నా హృదయ మాకర్షించినవి. హృదయశూన్యురాలి కేమి చెప్పిన దెలియును?

సుమ - తల్లీ! పుత్రునిగుణంబులు తల్లికిఁ బ్రియములగునట్లు నాగుణంబులు నీకు మనోహరములైన నగుంగాక దానం దప్పేమి?

రాజ - వయసుకాఁడా! నీ వెడగునొడుపులు నాచెవిం బడవు. గడుసువాఁడవు. నాచే నననిపించుదనుక నెఱుంగ నట్లభినయించెదవు. నిజము దాచనేల? వినుము. నే నీ వీణాపాదన నెపంబున నిన్నిందు రప్పించితిని కాని నాకు దీనియందు బ్రియము లేదు. నీయందు గాఢానురాగము గలిగినది. నిన్నుఁ గామించితిని. నాయభిలాషఁ దీర్పుము. తెలిసినదా?

సుమ - (చెవులు మూసికొని) దేవీ! నీవు స్వామిభార్యవు. నాకేగాక లోకమున కెల్లఁ దల్లివి. నీవు దుష్టురాలవై తేని రాష్ట్రమంతయుం జెడును. ధర్మ విరుద్ధము. అట్టిపనికి నేనంగీకరింపను.

రాజ — ఇది యధర్మమని యెట్లు చెప్పఁగలవు? ధర్మమేయని నేను వాదింపగలను. వినుము. స్త్రీలు పక్వాన్నము వంటివారు. అందరును భుజింపఁదగినవారు. అని శాస్త్రములోనే వ్రాయఁబడియున్నది.

శ్లో. పక్వాన్న మివ రాజేంద్ర! సర్వసాధారణా స్త్రియః
    తస్మా త్తాను న కుప్యేత న రజ్యేత రమేతచ.

అని యుండగా మొన్నమొన్ననే లోకమర్యాదనిమిత్తము పరస్త్రీగమనము నిషేధించుచు శ్వేతకేతుఁడను మహర్షి స్త్రీలకు గమ్యాగమ్యవివక్షతఁ దెచ్చిపెట్టెను.

శ్లో. మద్యపానా న్నివృత్తిర్చ | బ్రాహ్మణానాం గతోస్సుతాం
    పరస్త్రీభ్యశ్చ లోకానా మృషే రౌద్ధాలకేరపి !
    తతః పితు రనుజ్ఞానా ద్గమ్యూగమ్యప్యస్థయా
    శ్వేతకేతు స్తపోనిష్ట స్సుఖం శాస్త్రం నిబద్దనాన్.

లేనిపోనిశాస్త్రమును గల్పించి స్త్రీల కపకారము చేయఁజూచిన శ్వేతకేతుని మాటయే వేదవాక్యమా? అంతకుఁ బూర్వము వారందరు భ్రష్టలైరా?