పుట:కాశీమజిలీకథలు -07.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీరసింహుని కథ

85

చూచించుచున్న దేయని తలంచుచు నావిప్రునితో మాతండ్రి వృత్తాంత మీరేమి యెఱుఁగుదురో చెప్పుమని యడిగిన అతండు సర్వము నివేదించెను.

ఆ కథ విని రాజపుత్రు డాశ్చర్యసంభ్రమ వివశుఁడై యొక్కింత తడ వాలోచించి యొజ్జల మొగము జూచుచు నీ పారుండు చెప్పిన కథ యదార్థమా? అని యడిగిన వారేమియు మాటాడక‌ మూగలవలె నూరకొనిరి.

అంతలోఁగొందరు రాజపురుషులా విధమెరింగి త్వరితముగా వచ్చి యావిప్రుం బట్టికొని కట్టి తీసికొనిపోవుచుండ నాబ్రాహ్మణుఁడు మొర పెట్టెను. రాజపుత్రుఁ డడ్డము వచ్చి కట్టులు విప్పించి వారి నదలించుచు వీని అపరాధమేదియో చెప్పుఁడని యడిగిన వాండ్రు అయ్యా! ఇది మంత్రిశాసనము ఈతడు కఠినశిక్షకుఁ బాత్రుఁడని చెప్పిన నితండు చేసిన తప్పు చెప్పక తీసికొనిపోవనీయనని గట్టిగా నిర్భంధించెనట. కింకరులు భయపడుచుండ నందున్న యుపాధ్యాయులు నిజమంతయుఁ చెప్పి వేసిరట. అప్పుడు మీబిడ్డఁడు ఛీ! ఛీ! మా మంత్రులింత యవివేకులా? దేశాంతరగతుడైన ఱేనిఁ దీసికొని రాలేక‌ తమ పట్టణములో సాధుజనములపైఁ బ్రతాపములు జూపుదురుకాఁబోలు ఓహో ? వీరి రాజ్యతంత్రములు స్తుతిపాత్రములుగానున్నవి. నాకీవార్త నిన్నినాళ్ళు చెప్పక దాచినందులకు వారు శిక్షార్హులు ఈ భూసురుఁ డర్చనీయుఁడు అని పలుకుచు నాభూసురునకు గానుక లిప్పించి మమ్ముదనయొద్దకుఁ దీసికొనిరమ్మని యా రాజభటులు బంపెను.

మీకుమారుం డిపుడు సర్వకళాపూర్ణుండై పూర్ణిమాచంద్రుడు వోలె విరాజిల్లు చున్నవాఁడు. అతనికి ధనుర్వేదమునం దసమానప్రజ్ఞ కుదిరినది అతం డేమి దలఁచికొనినను సాగకమానదు. మమ్ము శిక్షింపవలయునని తలంచి యున్నవాఁడట. దేవీ? యనుగ్రహించి కుమారునికి గోపోపశమనము గావింపుము. అట్టిశాసనము నీయాజ్ఞ చొప్పునఁ గావించితిమి. కాని మేము స్వతంత్రించి చేయలేదు. రక్షింపుము నీకు నమస్కారము.

అనియున్న మంత్రులు వ్రాసిన పత్రికం జదివికొని హేమప్రభ మంత్రుల కభయప్రదాన పత్రిక పంపి కుమారుం దీసుకొని రమ్మని పనికత్తెలఁ బంపఁబోవు సమయంబునఁ గుమారుండే తల్లిం జూడవచ్చుచున్న వాఁడను వార్త యొక దాదివచ్చి చెప్పినది.

రాజపుత్రుఁడు విషాదమే దురహృదయుండై వినీత వేషముతో అంతిపురి కరిగి తల్లికి నమస్కరించెను. ఆమె కన్నీటిధారచేఁ బుత్రుని శిరంబు దడుపుచు అక్కునం జేర్చుకొని దీవించినది.