పుట:కాశీమజిలీకథలు -07.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

కాశీమజిలీకథలు - సప్తమభాగము


104వ మజిలీ

జితవతీ ప్రవాసము కథ

రోహిణీ! మిన్ను విరిగి మీదఁబడిన ట్లిప్పుడు వచ్చినవార్త వింటివా ? పాప మా వసుపత్ని నా నిమిత్తము వశిష్టమహర్షి హోమధేనువునుఁ దీసికొని రమ్మని భర్తను బ్రోత్సాహపరచిన దఁట అతం డన్నలతోఁగూడ నా మొదవుం బట్టికొని పాలు పితికించెనఁట. అవియే నాయెద్డ కనిపినది. వశిష్టమహర్షి యలిగి యా యపరాధ మూలమున వసువుల కెల్ల నేదియో శాపమిచ్చెనఁట. వసువు లందరు దఃఖించుచు నాజడదారి యాశ్రమమున‌ కరుగుచున్నారఁట. యిప్పుడే యోగిసక్త పరిచారిక యా కథగల పత్రిక మేడమీఁదికి విసరి పోయినది. క్షేమ సమాచారము లేమియు వ్రాయక పోవుటచే యోగసక్తయు దుఃఖించుచున్నట్టే తోచుచున్నది. అయ్యో ! నే నెంత పాపాత్మురాల నైతిని నాకతంబున దేవతా శ్రేష్ఠులు శప్తులై పోయిరే. భర్తచేఁ జేయఁగూడని పని నా నిమిత్తము చేయించిన యోగసక్తవంటి సఖురా లెందైనం గలదా। ఆమె రుణ మెట్లు తీర్చుకొందును? ఏమని శపింపఁబడిరో వ్రాసినదికాదు. పుడమి వశిష్ఠమహర్షి యాశ్రమ మెందున్నదియో తెలిసికొనిరమ్ము నే నక్కడికి బోయి యమ్ముని వరేణ్యుని పాదంబులంబడి వసువుల కిచ్చిన శాపము నాపై వ్యాపింపఁజేయుమని ప్రార్దించెదను. మరియొక తెరవున నాకు నిష్కృతి గలుగదు మారుమాట పలికితివేని నీ మొగము జూడను. ఈ పయిన మెవ్వరికిఁ దెలియనీయరాదు. ఇఁక నేను భోగములొల్లను. కాషాయాంబరములు దాల్చి యోగినీ వేషముతో నత్తాపససత్తము నాశ్రయించి వారి శాపము క్రమ్మరించెదను. లేదా, నేను భరించెదను. ఇది నిశ్చతము. అని యొకనాఁడు సాయంకాలము జితవతి రోహిణితోఁ బలికినది.

ఆ మాటలు విని రోహిణి యొక్కింతతడవు వివశమై యేమియుం బలుకక తొట్రుపాటుతో జితవతీ ! నీ కృతజ్ఞత కొనియాడఁదగి యున్నది. ఇట్లు పలుకుట నీకే చెల్లును. కాని యందలి ప్రయోజన మించుక విచారింపవలసి యున్నది. వసిష్ఠమహర్షినిఁ బ్రసన్నుఁజేయుటకై వసువులు తదాశ్రమమున కరిగిరిగదా? ప్రసన్నుఁ డయ్యెనేని వారు శాపముక్తు లగుదురు. కానిచో శాపఫలం బనుభవించి యుందురు. ఈ సరి కెద్దియో యొకటి జరగియే యుండును. భూమిలో వశిష్ఠాశ్రమమెందున్నదో తెలిసికొని కష్టనిష్ఠురముల కోర్చి మనమచ్చటికి వెళ్ళిన లాభమేమి యున్నది ? లెస్సగా విచారించి చెప్పుమని పలికిన జితవతి యిట్లనియె

రోహిణీ ! నిన్ను నేనీ పయనముగరించి యడిగినప్పుడు యిందలి గుణదోష