పుట:కాశీమజిలీకథలు -07.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

కాశీమజిలీకథలు - సప్తమభాగము

అమ్ముట ఎక్కడ అహహా పాడుదైవమా! యింత భ్రుష్టురాలిం జేసిన గాని నీ కక్ష దీరినది కాదేమి? అని వలుకుచు నా కలికిం గౌగలింపబోయెను.

అప్పుడయ్యింతి రవుదవ్వుల కోసరిల్లుచు నిలు నిలు మహారాజా! నాపతి పరలోక గతుడయ్యెను. నేనన్యపురుషుని ముట్టను. నన్నంటరాదు నాబ్రతు కిట్టిదియే యని పలి కిన అతండు మఱియుంగుందుచు గర్భభరాలసవై యున్న నిన్ను నట్టడవిలో విడిచి పోయిన గురుదత్తుఁడ దయావిహీనుఁడ నేనే యని పలికిన నా యిల్లా లించుక యాలో చించి యేమీ? నీవు గురుదత్తుఁడవే యెట్లు బ్రతికి వచ్చితివి? పరమార్థ మెఱింగించి నాసందియము దీర్చిఁ బ్రార్థించుచున్నాను. ఈ మాట సత్యమగుంగాక యని పలికినది కాని దుఃఖపరవశమై యుండుటచే నేమియు నెరుంగదు.

అప్పుడతండు కొన్ని రహస్యవిశేషము లెఱింగించి యామెకు నమ్మకముగలుగఁ జేసి బోటీ ! దై వమిప్పటికి మన కనుకూలుఁడై నట్లు తెలియుచున్నది. నీకుమారుఁడును నీతండ్రి గధాధరుఁడు నిందే వచ్చియున్నారు. నిన్ననే వారింజూచితిని. నేనని వారెరుం గరు. నచర్యలు విచారములో నున్నవని సంక్షేపముగాఁ జెప్పెను.

అప్పుడా ప్రోయాలు గోలున నేడ్చుచు నతని పాద౦బులం బడి ప్రాణేశ్వరా ! నిన్ను గురుతుపట్టక ప్రశ్నజేసినందులకు నాతప్పుమన్నింపుము మనము విడిచిపోయి పదునెనిమిది సంవత్సరములై నది. ఆహా ! దైవమహిమ యెట్టిది నాకు మతిపోయినది నేడే యంతయు స్ఫురించుచున్నది. అని కన్నీరు గార్చుచు నతనిం గౌఁగలించుకొని యెను.

ఆతం డామెను నక్కునఁ జేర్చికొని తదీయశీలమునకు మెచ్చు కొనుచు దైవ మహిమ వర్ణనాతీతముకానిచో నేఁడీ నాబుద్ది యీమార్గమున నడుచు వారింజూచి విమర్శన పూర్వకముగా జాలిఁజెందనేల? ప్రతిదినము నీమార్గంబున విహారమునకు వచ్చుచునే యుంటిని. మార్గంబున వీరందరు గనంబడుచుండిరి.

పరీక్షించి వాండ్రనెన్నఁడు చూడలేదు. ఈదినమున నాకట్టి బుద్ధి పుట్టుట భగ వచ్చర్యగాక మనుష్యయత్నమే. మనుష్యున కించుకయు స్వతంత్రముగలదా? అంతయుఁ దాను జేయుచున్నట్లు కనంబడును. ఏదియుఁ జేయంజాలఁడు. అదిగో పరిచారకుఁడు వచ్చుచున్నాడు ఊరకుండుమని పలికెను.

గుఱ్ఱపుఁ వాడింతలో నీరుదెచ్చెను. వానితో నోరీ యీగుఱ్ఱమును తీసికొని నీవు పొమ్ము. నేను వెనుక వచ్చెదనని చెప్పి వానింబంపివేసెను. తరువాత నామెతో గూడఁ బ్రచ్ఛన్నముగాఁ దన బసలోనికిం బోయెను.

అని యెఱింగించి.