పుట:కాశీమజిలీకథలు -07.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపరాధవిచారణ కథ

211

సభ్యులెల్లరు లేచి మరునాఁడా వింతఁజూచుటకై వేడుక పడుచుఁ దమతమ నివాసములకు౦ బోయిరి.

మృగదత్తుండు గదాధరుండును నాఁటికి దాటినది మరునాఁటికి వేరొక యుపా యము దొరకకపోవునా? యని సంతసించుచు నివేశ దేశమున కఱిగిరి. రత్నాం గియు సుమేధుఁడు పక్షపాతముగా విమర్శించుచున్నవాఁడని తన న్యాయవాది చెప్పు టచే మిక్కిలి విచారించుచు నెలవునకుం బోయినది.

అయ్యభియోగము విచారించుటచే సుమేధునకు మనంబుననేదియో విచార మంకురి౦చినది. ఆరాత్రి నిద్రయేపట్టినదికాదు. ఏదియోయాలోచించుచుండఁగనే తెల్ల వారినది. ఆరాజునకుఁ బ్రతిదినము ప్రొద్దుట గుఱ్ఱ]మెక్కి కొంతదూరము పోయి వచ్చుట వాడుకయైయున్నది. నాఁడుత్తరముగా యున్న యొక రాజమార్గమునంబడి పోవుచుండెను.

తఱుచు పట్టణప్రాంతమందలి పల్లెవారందఱు పెందలకడ లేచి పాలునుం, బెరుగు, నెయ్యి, పుల్లలు, కసవు, కాయఁగూరలు, ఫలములు లోనగు పదార్థము లన్నియుఁ బట్టణమునకుఁ తీసికొనివచ్చి యమ్ముకొనిపోవుచుందురు. మోయలేనిబరువు మోసుకొనుచు నడుమనడుమఁ దింపికొని యెత్తువారికొరకు నెదురుజూచుచు విడిపోయిన కట్టల సవరించుచు వెనకిఁ బడిన వారిం జీరుచుబలుకష్టములతోఁ వచ్చు చుండెడిజానపదులం జూచుచు సుమేధుఁడు నాఁడు తనదృష్టి దైవికముగా వారిపై వ్యాపించుటచే వారి శ్రమలకు వగచుచు వినోదముగా వారిం బరామర్శించుచు గుఱ్ఱమును మెల్లగా నడిపించుచుండెను.

గుఱ్ఱపువాఁడు ముందునడుచుచుఁ దొలఁగుఁడు దొలఁగుఁడు. ప్రభువువారు ప్రభువువారు అని యెదురువచ్చు జనుల బెదిరింపుచుండ వాండ్రు జడియుచు నెత్తి నుండి గంబల దిగవిడుచువారును దొందరగా నోసరిల్లి నేలంబడువారును, దద్దరిల్లి వెనుకకుఁ బరుగిడువారునునై యిక్కట్టులఁ జెందుచుండ జూచిఁ రాజు గుఱ్ఱపునానిని మందలింపుచు మాటాడనీయక గుర్రమువెనుక రమ్మని మెల్లగాఁ దన వారునమునకు నెదురువచ్చు వారికడ్డముగాకుండ నడిపించుచ౦డెను.

ఆహా! కడుపుచిచ్చునకుఁగదా? వీండ్రందరు మోయలేని బరువు మోచికొని వచ్చుచున్నారు. అయ్యయ్యో దైవమందఱను సమముగా భాగ్యవంతులఁ జేయక కొందఱఁ గటికి దరిద్రులను జేయుచున్నాడే.


శ్లో॥ ఆభిమత మహామాస గ్రంధిప్రబేదన పటీయసీ
     గురుతర గుణగ్రామాంభోజ స్రుటోజ్వల చంద్రికా