పుట:కాశీమజిలీకథలు -07.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27]

అపరాధవిచారణ కథ

209

రాజు - కొండపల్లిలో నేమిటికుంటివి?

మృగ - నాకది జన్మభూమి.

రాజు - నీతల్లి పేరు.

మృగ - నాకుఁదెలియదు సామి.

రాజు - ఇతరులు చెప్పగా వినలేదా.

మృగ - తలయొకమాటయుం జెప్పిరి సామి.

రాజు - తండ్రి గురుదత్తుఁడని చెప్పితివిగదా! తల్లి పేరుమాత్రమేమిటికిఁ దెలియదు.

మృగ - పద్మిని అని కొందఱు చెప్పిరి.

రాజు - (పీఠముపైఁ జేరబడి యొక్కింతతడవు ధ్యానించి మరల ధైర్య మంది) నీవీరత్నాంగి నెరుఁగుదువా?

మృగ - ఎరుఁగుదును.

రాజు - దానియింటిలోనున్న యొక పరిచారికం దీసి కొనిపోయితివఁ సత్య మేనా?

మృగ - లేదు. లేదు. అది వట్టిమాట చెప్పుచునున్నది.

రాజు - దాని యింటికిఁ బోయితివా?

మృగ - పోయితిని. అందున్న యామె కడునిల్లాలు సామి.

రాజు - ఎట్లు గ్రహించితివి.

మృగ - బోగమువాండ్రు కడు చెడ్డవారనియు వారింటికివచ్చుట తప్పనియు నాకుఁ జాల బోధించినదిసామి. మఱియు ననేక నీతులు బోధించినది. అప్పటి నుండియు నట్టిపనులు మానివేసితిని. నా వృత్తాంతము విని పేరు మార్చుకొమ్మని చెప్పినది. యుత్తరము (అనబోయి మానివేసెను.)

రాజు - ఉత్తరమేమి చెప్పుము. చెప్పుము. యదార్థము చెప్పిన దోషము లేదు.

మృగ - ఏమియో యుత్తరము వ్రాసియిచ్చినది.

రాజు - ఎవ్వరికిమ్మని.

మృగ - (సంశయింపుచు) మా బంధువులకే.

రాజు - బంధువులనగా నెవ్వరో సరిగా జెప్పుము.

మృగ - రామదుర్గనగరంబున నున్న కుముదాంగదునకు.

రాజు - చూపితివా?