పుట:కాశీమజిలీకథలు -07.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

కాశీమజిలీకథలు - సప్తమభాగము

అప్పుడు జితవతి యపరిమితానందముతో ఆఁ ! ఆఁ ! ఏది ! ఏది ! అని దానిం గైకొని యాజాబు విప్పి యిట్లు చదివినది.

సఖీ ! జితవతీ ! నీకిచ్చిన వరము జెల్లించుకొనఁ జాలప్రయత్నము సేయవలసి వచ్చినది. నీకిప్పుడు పంపిన పాలు దివ్యమహిమోపేతంబులు. వీనిం గ్రోలినవారు జరామయములు లేక దివ్యరూపధారులై పెద్ద కాలము జీవింతురు. శుభముహూర్తంబున నీవీ దుగ్ధంబులం ద్రావుము. నే నచిరకాలంబులో వచ్చి కర్తవ్యాంశములఁ బిమ్మట నుపదేశించెదను. పెద్దతడ విం దాలసింప రామింజేసి నిన్నుఁ జూచుట తటస్థించినది కాదు.

ఇట్లు నీ ప్రాణసఖురాలు,

యోగసక్త.

అని యున్న యాలేఖం బలుమారు చదివిచదివి జితవతి కన్నుల కొద్దికొనుచు నమ్మకచెల్లా ! అద్దేవికి నాయందెట్టి యనురాగము కలిగి యున్నది ! నాఁటిమాట మరువక స్వయముగా నీ దుగ్దంబులం దెచ్చియిచ్చినది? ఆమె దయకు మేరలేదు. అక్కటా నేనెంత పాపాత్మురాలను నిత్యము నచ్చటనే వసింపుచు నేఁడీ క్రింద మేఁడకు రానేల? నా సఖురాలిం గ్రమ్మరఁ జూచు భాగ్యము లేకపోయినదిగదా యని పశ్చాత్తాపము జెందుచు తల్లీ ! ఇప్పుడైన నా మాట నమ్ముదువా? స్వప్నమనియుఁ గల్ల యనియు భ్రాంతి యనియు నా కథకుఁ దలయొక పేరుం బెట్టితిరి గదా ! ఆదయా శాలిని నానిమిత్తమై దివ్యౌషధమును బంపినది. నన్నీ పాలం గ్రోలుమని వ్రాసినది. కాని నా పరిణయము మాట యేమియుఁ దెలిపినదికాదు. కర్తవ్యాంశము లన భర్తృవిషయములనియే తలంపవచ్చును. ఆమె వచ్చి యనుజ్ఞ యిచ్చుదనుక నేను గూడ నీక్షీరంబులం ద్రావను. వీనిం భద్రముగాఁ గాపాడుచుండుమని రోహిణి చేతి కిచ్చినది.

రాజపత్నియు నాజాబుఁ గన్నులారాఁ జూచుటచే నేమియుం బలుకనేరక కుమారిక మది ననుసరించియే కావించుటకు నిచ్చయించుకొని లోపలకుం బోయినది.

అని యెఱింగించి మణిసిద్ధుండు తదనంతర వృత్తాంతంబు పై మజలీయం డిట్లని చెప్పదొడంగెను.

103వ మజలీ.

నారధునికథ

అయ్యో ! యీ చెడువార్త నాచెవి నేమిటికిఁ బడవలయును? నేనా భూలోకమున కేమిటికిఁ పోయితిని! వారి కీవార్త జెప్పనేల ? మఱియొక చోటినిఁ బోవుద మను