పుట:కాశీమజిలీకథలు -04.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

కాశీమజిలీ కథలు

పొడిచెదవు? తురకబిడ్డవై పదునాలుగు విద్యలలోఁ బ్రశంసించిన నిన్ను మెచ్చుకొనవలయునుగాని బ్రాహ్మణులమగు మాకిది స్తుతిహేతువుగాదు సుమీ!

లవంగి - సఖీ! ఆప్తభావంబునం జెప్పుచుంటి; నాకు మొదటినుండియు బాండిత్యమునం దభిలాష మెండుగనుక నిన్నుఁజూచి వేడుకపడితి నింతియకాని నిందయని తలంచుకొనరాదుసుమీ.

మల్లిక - మాటవరుస కట్లంటినిగాన నీ పలుకుల నింద యేమున్నది. మఱియొకటి యడిగెదఁ దప్పుగాదేనిఁ జెప్పుము - యవనకుల సంజాతవగు నీకు హిందూవిద్యయం దభిలాష యేమిటికిఁ గలిగినది. హిందూదేవతల నారాధింప నేమిటికి వచ్చితివి? నీవృత్తాంత మించుక చెప్పుము.

లవంగి – మా తల్లికి నేడ్గురు పుత్రికలు పుట్టి యేడేఁడులు పెరిగి యెనిమిదవయేఁడు చొరబడినతోడనే మృతినొందిరి. ఎనిమిదవమారు నేను గర్భమునఁ బడితిని. అప్పుడు మా తల్లి మిగులఁబరితపించుచు గర్భం జెడఁగొట్టుకొను తలంపుతో నొక పరిచారికను రహస్యముగా నట్టియోషధి యెవరినేని నడిగితెమ్మని పంపినది. ఆ దాదివోయి తా నెఱింగిన యొకబ్రాహ్మణుని దా మందడిగినది.

ఆ విప్రుం దట్టిపని సేయనొల్లక తత్కారణము దెలిసికొని మంత్రాక్షత లిచ్చి సంతానము నిలుచునట్లు చేయగఁలనని శపథముఁజేసెను. ఆ విప్రుని రహస్యముగా నాయంగజాన యంతఃపురమునకుఁ దీసికొనిపోయి మా తల్లి తో నతనిమాటలం జెప్పినది. అప్పుడు మా తల్లి కాసజనించి చేయఁదగినకృత్యములేమని యాపారు నడిగినది. ఆయన మంత్రాక్షతలిచ్చి హిందూమతానుసారము గాఁ బిల్లపుట్టినదిమొదలు దేవాలయములలో నుత్సవములు చేయించుచు జపములు మంత్రములు బ్రాహ్మణుల చేతఁ జేయించుచుండవలయును. హిందూవిద్యయే చెప్పించుచుండవలయు నట్లయిన నీ పుత్రిక బ్రతుకునని చెప్పెను.

ఆ మాటలన్నియు మా తండ్రి కెఱిఁగించి యట్లు చేయుటకు సమ్మతించినది. పిమ్మట నేను జనించితిని. పుట్టిన పదిదినములలో జాతకర్మాద్యుత్సవములుజేసి బ్రాహ్మణ గృహమందే నన్నుఁ బెనుప నియోగించెను. ఏడేండ్లు వెళ్ళువఱకు నన్ను మా తల్లిదండ్రులు కన్నెత్తిచూడలేదు. హిందూవిద్యలే చదువుకొనుచుంటిని. గండము గడచిన పిమ్మట బ్రాహ్మణుల కనేకదానధర్మములు గావించి వేదశాస్త్రములే నాకుఁ జెప్పించిరి. దానంజేసి నేనావిద్యల జదివితిని. ఆ విద్యలే ప్రియమైనవి. కాశీమహిమ నీ నడుమఁ జదివితిని. తత్ప్రభావము భావమున కామోదము గలుగఁజేయు నీ ప్రయాణ సన్నాహంబుఁ గావించితినని తన వృత్తాంతమంతయు జెప్పినది.

ఆ మాటలు విని యతండు వెఱఁగుపడుచుఁ తరుణీ! నీ చరిత్రము మా యన్న చరిత్రమును బోలియున్నది. అతనికిని నీకును బూర్వజన్మ సంబంధ మెద్దియేనిఁ గలిగియున్నదేమోకదా? యని యా వృత్తాంత మంతయుం జెప్పెను.