276
కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము
గలిగియుండ వలయు వేగమ పొమ్మని యా నతిచ్చిననే నయ్యాజ్ఞ శిరంబునం దాల్చి తద్దత్తకామరూప ప్రభావములతోఁ బుడమియంతయు గ్రుమ్మఱితిని.
సీ. మగవాఁడు సౌందర్యఁ మహిమగాంచినచోట
నువిద చక్కఁదనాన నొప్పదయ్యె
భార్య సౌందర్యసంపత్తి నత్తినచోట
రమణుండు వికృతరూపమున వెలయు
నెలమి భార్యా భర్త లిరువురు రుచిమించి
పరిగినఁ బుత్రసంప్రాప్తి గలుగ
దట్టివారికిఁ బుత్రుడెట్ట కే జనియింపఁ
జూడఁజక్కనివాఁడు కాడు వాఁడు
గీ. పుడమి గమనీయసంతతి బడయువారు
చూడదగువారుగా రెల్ల చోటులట్టు
లన్నిలక్షణములు గల్గునట్టివారి
వెదకి కనలేక తిరిగి నే విసిగిపోతిని.
పుడమి యింతగొడ్డునోపునేయని యాక్షేపించుచుఁ గార్యసాఫల్యంబు గామి విషణ్ణ హృదయుండనై మఱల నలకాపురంబున కరుగుచుండ దారిలో నారదమహర్షి తారసిల్లుటయు నమస్కరించితి నమ్మహాత్ముండు నన్ను దీవించుచు నెక్కడినుండి వచ్చుచున్నవాఁడ వేమిటిది కార్యంబని యడిగిన నేను వినయంబుతో ధనపతి శాసన ప్రకారంబు జెప్పి మునివరా ! భూమియన నేమియో యనుకొంటి జక్కని యొక్క మిధునంబు గనంబడినది కాదే యని సాక్షేపముగాఁ బలికిన నవ్వుచు నత్తాపసోత్తముం డిట్ల నియె.
కుబేరానుచరా ! సుందరదేవతా మిధునంబులం గాంచుచుండెడి నీ కన్నులకు మానవ దంపతులు రుచింతురా ? కానిమ్ము వింధ్య కూటనగరంబునకుం బోయితివా ? అందు మణికుండలుండను రాజనందనుం గాంచితివా ? అతని భార్య గంధర్వ దత్త నీకుఁ గనంబడినదా ? వారి కుమారుఁడు బుష్పదంతుండు, నీ కన్నుల పండువు గావించెనా ? వారి జూచిన నీ విట్లనవుగా యని పరిహాసమాడి యా దేవముని యలకాపురంబునకుం బోయెను. అప్పుడు నేనప్పట్టణంబు జూడమికి బశ్చాత్తాపము జెందుచు మఱలి సత్వరంబున మీ పురంబునకుం జనుదెంచితి. దైవవశంబున మీరు నాఁటి రాత్రి బుత్రుని లాలించుచు నుప్పరిగమీఁద నీ శయ్యపైఁ బండుకొని నిద్ర బోయితిరి. మిమ్ముజూచి యాశ్చర్యము నొందుచు దేవముని ప్రభావనుగ్గింపుచు దిగ్గున నీ మంచము శిరంబున నిడుకొని యుప్పరమున కెగసి యలకాపురాభిముఖుండనై యరుగుచుండ నొకదండఁ ప్రచండజంఝామారుతంబు విసరినది, తద్వాత ఘాతంబున మీరా శయ్యనుండి పుడమిం బడితిరి.