28
కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము
ముచ్చటగా నున్నది. మీ సుముఖత్వము మనోహరమై యున్నది. అని పొగిడిన నతనిమాటలకు సందియమందుచు నయ్యిందువదన యంతటితోఁ బ్రసంగము విరమించి చేతులు జోడించి అందుండియే విశ్వేశ్వరు నిట్లు వినుతించినది.
జయ శంకర పంకజనాభ విధి
ప్రముఖామరసేవిత పాదయుగ
స్థిరముక్తిద భక్తినిదాన భరా
బ్దిజలే పతితా మవమాం కృపయా ॥1॥
ధరణీధరమందిర! బాలనిశా
కరశేఖర! భూతిమనోహర! హే
హర! పాప భయంకర! ఘోరభవా
బ్దిజలే పతితా మవమాం కృపయా ॥2॥
గిరిచాప! మహీధర! వారిధితూ
ణ! రమాధవబాణ! మహారథిక!
త్రిపురాసురభంజన! ఘోరభవా
బ్దిజలే పతితా మవమాం కృపయా ॥3॥
అని యవ్వనితారత్నము విశ్వేశ్వరమహాదేవుని నినుతించిన విని యవ్వీరుండు సంశయాకులహృదయుండై (అహో కిమేతర్ పతితా మిత్యంగనావిశేషణస్తౌషి) అయ్యో యిదియేమి? నీవు వనితాం అని స్త్రీవిశేషణము వైచికొని స్తోత్రము చేయుచున్నా వని యడుగఁగా (వనితారచితస్తుతివృత్తరత్నా నియమా ఫణితాని) స్త్రీచేత రచియింపబడిన వృత్తములు నాచే నిప్పుడు చదువబడిన వని యుత్తరముఁజెప్పి యమ్మ త్తకాశిని తత్తరముఁ జెందుచుఁ జెలికత్తియలతోఁగూడ నచ్చోటు కదలి సత్వరముగా వచ్చినదారి ననుసరించి తన యంతఃపురమునకుం జనినది. అని యెఱింగించు వఱకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డంతటితో నావృత్తాంతముఁ చెప్పుటఁ జాలించి పైమజిలీయందుఁ దదనంతర వృత్తాంతమిట్లని చెప్పఁదొడంగెను.
ముప్పదియైదవ మజిలీ.
గోపా! విను మట్లు లవంగి సఖులతో నంతఃపురంబునం బ్రవేశించి భుజించిన వెనుక నొక రహస్యప్రదేశంబునం గూర్చుండి వారితో నిట్లు సంభాషించినది.
లవంగి - కుందలతిలకా! నేడు మీదయావిశేషంబునం గదా విశ్వేశ్వరునిం జూడగంటిని. కాకున్న నందఱ మరిగి యా యాలయంబున బ్రవేశింపశక్యమా?
కుంద - నీచే విశ్వేశ్వరలింగమున కభిషేకముఁ జేయంచలేక పోయితిమని లజ్జించుచున్నాము. ఆ గుమ్మముఁగాచియున్న బ్రాహ్మణకుమారుం డసాధ్యుండుగదా? ఏమి చేయుదుము.